తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నల్లధనంపై సమాచారం ఇవ్వడం కుదరదు' - సమాచార హక్కు చట్టం

స్విట్జర్లాండ్​లో భారతీయులపై నమోదైన నల్లధనం కేసుల వివరాలు వెల్లడించడానికి ఆర్థిక మంత్రిత్వశాఖ నిరాకరించింది. గోప్యత నిబంధనలే ఇందుకు కారణమని ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

'నల్లధనంపై సమాచారం ఇవ్వడం కుదరదు'

By

Published : May 17, 2019, 5:49 PM IST

స్విట్జర్లాండ్​లో భారతీయులపై నమోదైన నల్లధనం కేసుల వివరాలను గోప్యత కారణాల దృష్ట్యా వెల్లడించేందుకు కేంద్రప్రభుత్వం నిరాకరించింది. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు స్పందించిన ఆర్థిక మంత్రిత్వశాఖ.. నల్లధన సమాచారం రహస్య పరిశీలనలో ఉందని తెలిపింది.

స్విట్జర్లాండ్​ నుంచి స్వీకరించిన నల్లధనం కేసుల వివరాలు, సంబంధిత సంస్థలు, వ్యక్తుల పేర్లు తెలపాలని.., ఆ సమాచారం ఆధారంగా ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరించాలని ఓ పాత్రికేయుడు సహ చట్టం కింద దరఖాస్తు చేశారు.

పన్ను సమాచారం, ఇతర ఆర్థిక వివరాలు ఇచ్చిపుచ్చుకునేందుకు భారత్​, స్విట్జర్లాండ్ 2016 నవంబర్ ​22న ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందానికి లోబడి ఈ సంవత్సరం నుంచి స్విట్జర్లాండ్​లోని భారతీయుల ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ భారత్​కు వస్తాయని విత్త మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ సమాచారం నల్లధనాన్ని గుర్తించడం సహా, స్విట్జర్లాండ్​లోని భారతీయుల ఆస్తులను పన్ను పరిధిలోకి తెచ్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది. అయితే... దేశం లోపల, వెలుపల ఎంత నల్లధనం చలామణిలో ఉందో తెలిపే కచ్చితమైన అంచనా లేదని స్పష్టం చేసింది.

ఇతర దేశాల సంగతేంటి?

ఆర్టీఐ దరఖాస్తులో.. ఇతర దేశాల నుంచి అందిన నల్లధనం కేసుల వివరాలనూ వెల్లడించాలని ఆర్థిక మంత్రిత్వశాఖను కోరారు.

డబుల్​ టాక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందం​ ప్రకారం ఫ్రాన్స్​ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా హెచ్​ఎస్​బీసీ బ్యాంకు ఖాతాల కేసుల విషయంలో చర్యలు తీసుకున్నామని ఆర్థికమంత్రిత్వశాఖ తెలిపింది. కొన్ని పేర్లు వెల్లడించని విదేశీ బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ.8,465 కోట్లను పన్ను పరిధిలోకి తెచ్చామని తెలిపింది.

ఇదీ చూడండి: సార్వత్రిక ప్రచారం సమాప్తం- 19న తుది దశ

ABOUT THE AUTHOR

...view details