తెలంగాణ

telangana

By

Published : Nov 20, 2019, 11:17 PM IST

ETV Bharat / bharat

చంద్రయాన్-2: '500మీ. దూరంలో అలా జరిగిపోయింది'

చంద్రయాన్​-2 ప్రయోగ వివరాలను అంతరిక్ష సహాయమంత్రి జితేంద్ర సింగ్ లోక్​సభకు లిఖితపూర్వకంగా వివరించారు. ల్యాండర్ విక్రమ్ చంద్రుని ఉపరితలానికి 500 మీటర్ల సమీపం వరకు వెళ్లి సాంకేతిక లోపంతో కూలిపోయిందని వెల్లడించారు. ల్యాండర్ అవరోహణ వేగాన్ని తగ్గించడంలో వైఫల్యం చెందడమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు.

చంద్రయాన్-2: '500మీ. దూరంలో అలా జరిగిపోయింది'

చంద్రయాన్​-2 ల్యాండర్ విక్రమ్​.. చంద్రుని ఉపరితలానికి 500 మీటర్ల సమీపం వరకు వెళ్లి కూలిపోయిందని అంతరిక్ష విభాగ సహాయమంత్రి జితేందర్​ సింగ్ లోక్​సభకు లిఖితపూర్వకంగా వివరించారు. ల్యాండర్ అవరోహణ వేగాన్ని తగ్గించడంలో వైఫల్యం చెందడమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు.

"చంద్రుని దక్షిణ ధ్రువంలో పరిశోధనలు చేయడానికి ఇస్రో మొదటిసారి ప్రతిష్ఠాత్మకంగా చంద్రయాన్​-2ను ప్రయోగించింది. మొదటి దశలో చంద్రుని ఉపరితలం నుంచి 30 కి.మీ నుంచి 7.4 కి.మీ వరకు... ల్యాండర్ వేగాన్ని 1,683మీ/ సెకను నుంచి 146మీ/సెకన్​కు తగ్గించారు. అక్కడ వరకు అంతా సాఫీగానే సాగింది.

రెండో దశలో విక్రమ్​ ల్యాండర్ అవరోహణ వేగం నియంత్రించడంలో సమస్యలు ఏర్పడ్డాయి. అవరోహణ వేగం నిర్దేశించిన పారామితుల కంటే అధికంగా ఉండడం వల్ల చంద్రుని ఉపరితలానికి సుమారు 500 మీటర్ల దూరంలో ల్యాండర్ విఫలమైంది." - జితేంద్ర సింగ్​, అంతరిక్ష విభాగం సహాయమంత్రి

విజయవంతమే..

విక్రమ్ ల్యాండింగ్​లో సమస్య ఏర్పడినప్పటికీ.. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైందని జితేంద్రసింగ్ పేర్కొన్నారు. చంద్రయాన్​-2 ప్రయోగ దశ, అంత్యంత క్లిష్టమైన కక్ష్య విన్యాసాలు, ల్యాండర్ వేరు పడడం, డీ-బూస్ట్​, కఠినమైన బ్రేకింగ్ దశతో సహా అన్నీ విజయవంతంగా జరిగాయని ఆయన విశదపరిచారు.

మిషన్​ జీవితం పెరిగింది...

శాస్త్రీయ లక్ష్యాలకు సంబంధించి.. ఆర్బిటర్​లోని ఎనిమిది అత్యాధునిక సాధనాలు.. డిజైన్ ప్రకారం పనిచేస్తున్నాయని జితేంద్ర తెలిపారు. ఈ ఆర్బిటర్ చంద్రుని కక్ష్య చుట్టూ పరిభ్రమిస్తూ విలువైన శాస్త్రీయ సమాచారాన్ని అందిస్తోందని ఆయన తెలిపారు. ఆర్బిటర్ అత్యంత కచ్చితత్వంలో పనిచేస్తోందని, కనుక మిషన్​ జీవితాన్ని ఏడు సంవత్సరాలకు పెంచినట్లు ఆయన లోక్​సభకు వివరించారు.​

నిరంతర సమాచారం

ఆర్బిటర్​ నుంచి అందుతున్న డేటాను శాస్త్రీయ సమాజానికి నిరంతరం అందిస్తున్నామని జితేంద్ర స్పష్టం చేశారు. ఇటీవల దిల్లీలో నిర్వహించిన ఆల్​ ఇండియా యూజర్​ మీట్​లో​ ఇదే అంశాన్ని సమీక్షించామని ఆయన తెలిపారు.

చంద్రయాన్​-2..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2019 జులై 22న చంద్రయాన్​-2ను ప్రయోగించింది. దీనిలో ఆర్బిటర్, ల్యాండర్​, రోవర్​లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఆగస్టు 20న చంద్రయాన్​-2 విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. సెప్టెంబర్​ 2న ఆర్బిటర్​ నుంచి ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా విడిపోయింది. అయితే చంద్రుని ఉపరితలంపై దిగడానికి కేవలం 500 మీటర్ల దూరంలో ల్యాండర్​లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమై కూలిపోయింది.

ఇదీ చూడండి:చిట్​ఫండ్​ చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details