తెలంగాణ

telangana

By

Published : Aug 2, 2020, 8:05 AM IST

ETV Bharat / bharat

అయోధ్య: శ్రీరాముని మందిరం... వెయ్యేళ్లు పదిలం

అయోధ్యలో రామ మందిర శంకుస్థాపనకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వెయ్యేళ్లయినా ఆలయం చెక్కుచెదరకుండా ఉండే విధంగా మందిరాన్ని నిర్మించనున్నారు. భూకంపం వచ్చి రిక్టర్​ స్కేల్​పై 10 తీవ్రత నమోదైనా ఆలయానికి ఏమీకాని విధంగా తీర్చిదిద్దుతున్నారు.

All set for Ayodhya's Ram temple construction
శ్రీరాముని మందిరం... వెయ్యేళ్లు పదిలం

అబ్బురపరిచే ఆకృతిలో నిర్మించనున్న అయోధ్య రామ మందిరం నాణ్యతలోనూ దానికదే సాటిగా నిలవనుంది. ఎంతలా అంటే వెయ్యేళ్లయినా ఆలయం చెక్కుచెదరదని నిపుణులు చెబుతున్నారు. భూకంపం సంభవించినా.. రిక్టర్‌స్కేల్‌పై 10 తీవ్రత నమోదైనా ఆలయానికి ఏమీకాని విధంగా ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌, చంద్రకాంత్‌ సోమ్‌పుర డిజైన్‌ చేశారు. ప్రధాన ఆలయాన్ని రెండెకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. మిగతా స్థలంలో అనేక రకాల చెట్లు పెంచడంతో పాటు.. మ్యూజియమ్‌, ఆలయానికి సంబంధించిన భవనాలను నిర్మిస్తారు. ఆలయం ఎన్నటికీ చెక్కుచెదరని రీతిలో ఉండేందుకు గాను ఇక్కడి భూసారాన్ని 200 అడుగుల లోతు వరకు తవ్వి పరీక్షించారు. ఆలయ రూపలావణ్యం, ఆకృతిలోని సౌందర్యం గానీ వెయ్యేళ్ల వరకు అలాగే నిలుస్తుందని నిర్మాణ పనుల సూపర్‌వైజర్‌ అన్నుభాయ్‌ సోమ్‌పుర తెలిపారు. ఒకేసారి 10 వేలమంది భక్తులు దర్శించుకొనేందుకు వీలుగా డిజైన్‌ చేశారు.

మూడు లక్షల దీపాల కాంతులు..

రామ మందిరం భూమిపూజ సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో అయోధ్యలో 3 లక్షల దీపాలు వెలిగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 5న భూమిపూజ జరగనున్న నేపథ్యంలో 3, 4 తేదీల్లో అయోధ్యలోని అన్ని ప్రధాన ఆలయాలు, మఠాల్లో ఈదీపాలను వెలిగిస్తారు. విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు అందరూ ఇందులో పాలుపంచుకుంటున్నారు. తొలుత లక్షా 22 వేల దీపాలు వెలిగించాలని అనుకున్నా.. తర్వాత నగరమంతా భారీఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకుగాను డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా అవధ్‌ యూనివర్సిటీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.

ప్రపంచ పర్యటక హబ్‌

అయోధ్య అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా అవధ్‌ యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్‌ మనోజ్‌ దీక్షిత్‌ 'ఈటీవీ భారత్‌'కు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యటక పరమైన అనేక ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. అయోధ్య ప్రపంచ ప్రఖ్యాత పర్యటక హబ్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. డజను దాకా పెద్ద హోటళ్లు, అతిథిగృహాలు, అంతర్జాతీయ బస్‌ టెర్మినళ్లు వంటివన్నీ వస్తాయన్నారు. అయోధ్య నుంచి అనేక చారిత్రక నగరాలు, పట్టణాలను కలిపేందుకు ప్రత్యేకంగా రోడ్ల నిర్మాణానికి గాను ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.

రామ జన్మభూమి ట్రస్టుకు 67 ఎకరాల బదలాయింపు

భారీస్థాయి రామ మందిరం నిర్మాణం నిమిత్తం అయోధ్య చట్టం కింద సమీకరించిన 67 ఎకరాల భూమిని ‘శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు’కు శనివారం లాంఛనంగా బదలాయించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఈ ట్రస్టును 15 మంది సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

రామ్‌లల్లాను సందర్శించనున్న మొదటి ప్రధాని మోదీయే

అయోధ్యకు గతంలోనూ పలువురు ప్రధానమంత్రులు వచ్చినా రామ్‌లల్లాను సందర్శించబోతున్న తొలి ప్రధాని మాత్రం నరేంద్రమోదీయే. ఎన్నికల ప్రచారంలో భాగంగానూ మోదీ అయోధ్యకు వచ్చినా రామ్‌లల్లాను సందర్శించలేదు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, ఏబీ వాజ్‌పేయీల విషయంలోనూ అలాగే జరిగింది.

ఆడ్వాణీ, జోషిలకు ఆహ్వానంపై అస్పష్టత

రామజన్మభూమి ఉద్యమంతో సంబంధం ఉన్న కొందరు ముఖ్య నేతల్ని రామాలయం భూమి పూజకు ఆహ్వానిస్తున్నారా లేదా అనే విషయమై అస్పష్టత తొలగడం లేదు. భాజపా సీనియర్‌ నేతలైన ఎల్‌.కె.ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషిలను తప్పకుండా ఆహ్వానిస్తామని ఆలయ ట్రస్టుకు చెందిన కొందరు ప్రతినిధులు వెల్లడించారు. ఒకవేళ వారిద్దరినీ ట్రస్టు పిలిచినా వయోభారం దృష్ట్యా వారు హాజరుకావడం కష్టమేనని, మహా అయితే వీడియో కాన్ఫరెన్సులో వీక్షిస్తారని మరికొందరు అంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి, యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌లకు శనివారం ఆహ్వానాలు అందాయి. బాబ్రీ మసీదు కూల్చివేతలో, పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కొందరు కరసేవకుల కుటుంబ సభ్యులను ట్రస్టు తరఫున పిలుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details