తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండోసారి భారత ప్రధానిగా నేడే మోదీ 'ప్రమాణం' ..

ఎన్డీఏ లోక్​సభాపక్ష నేత నరేంద్ర మోదీ నేడు భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రాత్రి 7 గంటలకు దిల్లీలోని రాష్ట్రపతి భవన్​ ఎదుట జరిగే కార్యక్రమంలో మోదీతో పాటు.. కొత్త మంత్రులూ ప్రమాణం చేయనున్నారు.

By

Published : May 30, 2019, 5:02 AM IST

Updated : May 30, 2019, 7:05 AM IST

రెండోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం నేడే..

నేడే మోదీ ప్రమాణ స్వీకారం

ఇటీవల ముగిసిన లోక్​సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. రెండోసారి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

దిల్లీలోని రాష్ట్రపతి భవన్​ ఎదుట బహిరంగ స్థలంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం జరగనుంది. ప్రపంచ దేశాధినేతలు, అన్ని రాష్ట్రాల ప్రముఖులు, పార్టీ గెలుపు కోసం కృషి చేసిన భాజపా కార్యకర్తల కుటుంబాల సమక్షంలో ఘనంగా జరగనుందీ వేడుక. రాత్రి 7 గంటలకు జరగనున్న కార్యక్రమంలో నరేంద్ర మోదీతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ మోదీతో ప్రమాణం చేయించనున్నారు.

మంత్రివర్గంలో ఎవరెవరు...?

మంత్రి వర్గంలో ఎవరెవరు ఉంటారనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. కూర్పుపై పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్​షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు మోదీ. కేంద్ర ప్రభుత్వంలో కీలకం కాగలరని భావిస్తున్న షాకు ఏ మంత్రిత్వ శాఖ దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 353 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. భాజపానే స్వయంగా 303 సీట్లు నెగ్గి పూర్తి మెజార్టీ సాధించింది. కాంగ్రెస్​ 52 స్థానాలకే పరిమితమైంది.

8 వేల మందికి పైగా అతిథులు...

ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావించిన భాజపా.. వేల మందికి ఆహ్వానాలు పంపింది. కార్యక్రమానికి దాదాపు 8 వేల మంది అతిథులు హాజరుకానున్నట్లు సమాచారం. రాష్ట్రపతి భవన్​లో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద కార్యక్రమం అని పేర్కొన్నారు రాష్ట్రపతి భవన్​ ప్రతినిధి అశోక్​ మాలిక్​.

బిమ్​స్టెక్​ దేశాధినేతల హాజరు...

మోదీ ప్రమాణ స్వీకారానికి ఈ సారి బిమ్​స్టెక్​ దేశాలతో పాటు మారిషస్​, కిరిగిస్థాన్ అధినేతలకు ఆహ్వానాలు పంపారు. బిమ్​స్టెక్​ దేశాల్లో భారత్​, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్​ దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. 2014లో మోదీ పదవిని స్వీకరించేటప్పుడు సార్క్​ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అందులో పాకిస్థాన్​ అప్పటి ప్రధాని నవాజ్​ షరీఫ్​ కూడా ఉన్నారు.

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియాగాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, తెలుగు రాష్ట్రాల నుంచి కేసీఆర్​, జగన్​, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.

వంటల ఘుమఘుమలు...

ప్రమాణస్వీకారం అనంతరం రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆతిథ్యం ఇవ్వనున్న విందు కోసం ప్రత్యేక వంటకాలు సిద్ధం చేస్తున్నారు. 'దాల్​ రైసినా'ను విదేశాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా వడ్డించనున్నారు.

భాజపా ఎంపీలంతా మొదట దిల్లీలోని మహాత్మాగాంధీ, వాజ్​పేయీ సమాధుల వద్ద నివాళులర్పించనున్నారు. ప్రధానితో పాటు ఎంపీలంతా ఈ కార్యక్రమంలో తప్పక పాల్గొనాలని భాజపా ఓ ప్రకటన విడుదల చేసింది. మంత్రివర్గం కూర్పుపైనా సుదీర్ఘ చర్చలు జరిగాయి. నూతన మంత్రి వర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనేది ప్రమాణ స్వీకారం సమయంలో స్పష్టం కానుంది.

ఇదీ చూడండి:

'సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే వరకు వేచి ఉంటాం'

Last Updated : May 30, 2019, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details