తెలంగాణ

telangana

By

Published : Apr 16, 2023, 7:45 AM IST

Updated : Apr 16, 2023, 9:11 AM IST

ETV Bharat / bharat

అతీక్​ భయపడినట్టే హత్య.. మీడియానే రక్ష అనుకుంటే జర్నలిస్టుల్లా వచ్చి..

Atiq Ahmad Killed :ఆ గ్యాంగ్‌స్టర్లు భయపడినట్లే జరిగింది. జైలు నుంచి బయటకు వస్తే చంపేస్తారని.. ప్రాణ భయంతో వారు చేసిన వ్యాఖ్యలే నిజమయ్యాయి. తమను హత్య చేస్తారని అతీక్ అహ్మద్, అతడి తమ్ముడు అష్రఫ్ అహ్మద్‌ కొన్నిరోజులుగా చెబుతూ.. ఇదే విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లినా వారికి చుక్కెదురైంది. మీడియా వల్లే తాను సురక్షితంగా ఉన్నానని చెప్పిన అతీక్‌ అహ్మద్‌ను అదే మీడియా ముందు దుండగులు కాల్చి చంపడం తీవ్ర కలకలం రేపుతోంది. అతీక్‌ సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ కూడా తనను రెండు వారాల్లో చంపేస్తారని భయంతో వణికిపోయాడు. వీరిద్దరూ భయపడ్డట్లే దుండగులు పోలీసులు, పాత్రికేయుల సమక్షంలోనే.. పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్పులు జరిపి హతమార్చారు.

atiq-ahmad-murder-atiq-ahmed-feared-about-his-life
అతీక్ అహ్మద్ ఎన్‌కౌంటర్

Atiq Ahmad murder : హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్‌ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ అహ్మద్.. తమను చంపేస్తారని ప్రాణభీతితో చేసిన వ్యాఖ్యలే నిజమయ్యాయి. శనివారం అర్ధరాత్రి.. వీరిద్దరిని దుండగులు అతి సమీపం నుంచి కాల్పి చంపారు. అతీక్‌ అహ్మద్‌ కుమారుడు ఈ నెల 13న పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోగా.. తాజాగా అతడ్ని, సోదరుడిని దుండగులు కాల్చి చంపారు. అతీక్‌ అహ్మద్‌ అయిదుగురు కుమారుల్లో అసద్‌ మృతి చెందగా.. మిగతా నలుగురిలో ఇద్దరు కుమారులు జైల్లో ఉన్నారు. మైనర్లయిన ఇద్దరు కుమారులు గృహ నిర్భంధంలో ఉన్నారు. అతీక్‌, అష్రఫ్‌ భార్యలు పరారీలో ఉన్నారు.

ఘటన జరిగిన ప్రదేశం
  • 2005లో బీఎస్​పీ శాసనసభ్యుడు రాజు పాల్‌ హత్య కేసులో అతీక్‌ అహ్మద్‌ ప్రధాన నిందితుడు.
  • 2019 నుంచి సబర్మతి జైల్లో ఉన్నాడు. అతీక్‌పై వందకు పైగా క్రిమినల్‌ కేసులున్నాయి.
  • రాజు పాల్‌ హత్యకేసులో ముఖ్యసాక్షిగా ఉన్న ఉమేశ్‌ పాల్‌ 2006లో అపహరణకు గురై విడుదల అయ్యాడు. 2007లో అతడు అతీక్‌, అష్రఫ్‌తోపాటు మరికొందరిపై కిడ్నాప్‌ కేసు పెట్టాడు.
  • కిడ్నాప్ కేసు విచారణ చివరి రోజైన ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్‌పాల్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులోనూ అతీక్​ కుటుంబ సభ్యులే ప్రధాన నిందితులు.

ఉమేశ్​ పాల్ హత్య కేసు విచారణ నేపథ్యంలో.. బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారని అతీక్‌ అహ్మద్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే.. అక్కడ చుక్కెదురైంది. అప్పుడు గుజరాత్‌లోని సబర్మతి కేంద్ర కారాగారంలో ఉన్న అతీక్‌ను ఓ కేసు విచారణలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ కోర్టుకు తీసుకువచ్చారు. తొలుత జైలు నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించిన అతీక్‌ను చివరకు ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే తనను 2 వారాల్లో జైలు నుంచి బయటకు రప్పించి చంపేస్తానని ఓ సీనియర్ అధికారి బెదిరించినట్లు అష్రఫ్‌ ఇటీవల ఆరోపించారు. ఒకవేళ తాను హత్యకు గురైతే ఆ అధికారి పేరు ముఖ్యమంత్రికి చేరుతుందన్నారు.

అతీక్​ హత్యకు గురైన స్థలం

మరోవైపు... అతీక్‌ నేరసామ్రాజ్యాన్ని కూల్చేస్తున్న యోగి సర్కార్.. ఆర్థిక మూలాలపైనా పెకిలించి వేస్తున్నారు. అతీక్‌, అతని అనుచరుల అక్రమాస్తుల్లో ఇప్పటివరకు 1400 కోట్ల రూపాయలు విలువైన సంపదను ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో 108 కోట్ల రూపాయల నల్లధనాన్ని ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ అధికారులు గుర్తించారు.

ఘటన ప్రదేశం

అతీక్​ చివరి మాటలు..
హత్యకు ముందు అతీక్.. తన కుమారుడి అంత్యక్రియల గురించి మాడ్లాడాడు. "మీ కొడుకు అసద్​ అంత్యక్రియలకు మీరు ఎందుకు వెళ్లలేదు?" అని అతీక్​ను​ ఓ జర్నలిస్టు అడిగారు. దానికి అతీక్​ "నన్ను పోలీసులు తీసుకువెళ్లలేదు. అందుకే వెళ్లలేదు." అని సమధానమిచ్చారు. ఇవే అతడి చివరి మాటలుగా నిలిచాయి. అనంతరం జర్నలిస్టుల రూపంలో వచ్చిన దుండగులు.. అతీక్​ను​ కాల్చి చంపారు.

Last Updated : Apr 16, 2023, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details