TDP Leader Pattabhi on Assigned Lands Sorting: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భూ బకాసురుల కోసమే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ చట్టానికి సవరణలు అంటున్నాడని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. చట్టాన్ని సవరించడం కోసం రాష్ట్రంలో అతి పెద్ద భూ కబ్దాదారుడైన ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో కమిటీ వేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా జగన్ రెడ్డి పేదలకు భూములపై హక్కులు కల్పించేవాడే అయితే, ఎన్నో ఏళ్ల నుంచి అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న వారిని భయపెట్టి, ఇళ్ల పట్టాల కోసం భూములు లాక్కుంటాడా అంటూ మండిపడ్డారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్న పట్టాభి.. ప్రతిపక్షాలతో చర్చించి క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూములు తన పార్టీ వారికి అప్పగిస్తే, వారు అవి అమ్మేసి వచ్చే ఎన్నికల్లో తన కోసం పనిచేస్తారన్న ఆశ కూడా ముఖ్యమంత్రితో ఈ పని చేయిస్తోందని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దుయ్యబట్టారు.