చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: నాదెండ్ల మనోహర్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 5, 2023, 8:49 PM IST
|Updated : Dec 6, 2023, 6:37 AM IST
Nadendla Manohar Comments on Crop Loss: మిగ్జాం తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకి 20 వేల రూపాయలను ఇవ్వాలని తెలిపారు. పంట నష్టానికి సంబందించిన సహాయాన్ని తక్షణమే అందించాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంటలు తుపాను కారణంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
తుపాను వల్ల రైతులు సర్వం నష్టపోయారని నాదెండ్ల చెప్పారు. రైతులను ఆదుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆయా జిల్లాలకు ప్రభుత్వం విడుదల చేసిన రూ. 2 కోట్ల సాయం ఏమాత్రం చాలదన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు భరోసా నింపే విధంగా జనసేన పార్టీ నిలబడుతుందని తెలిపారు. తుపాను పరిస్థితులపై ఆయా జిల్లాల నాయకులతో నాదెండ్ల మనోహర్ ఫోన్లో మాట్లాడారు.