శ్రీకాకుళం జిల్లాలోని రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్ - తప్పిన ప్రాణనష్టం
Published : Jun 29, 2024, 4:48 PM IST
Fire Accident in Pydibhimavaram :ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రణస్థలం మండలం పైడిభీమవరంలోని పారిశ్రామిక వాడలో ఉన్న సరాక కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. దీంతో ఒక్కసారిగా పరిశ్రమలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మరోవైపు ప్రమాద సమయంలో కార్మికులు, ఉద్యోగులు భోజనం చేసేందుకు బయటికి రావడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు.