Published : Aug 16, 2024, 11:53 AM IST
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పించిన కేటీఆర్
KTR New Tweet: బీఆర్ఎస్ కృషిని తమ ఖాతాలో వేసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. మొన్న 30వేల ఉద్యోగాలు ఇచ్చామని, నిన్న కాగ్నిజెంట్ కంపెనీ తెచ్చామని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టును సైతం మీరే కట్టామంటున్నారని ఎద్దేవా చేశారు. మా కష్టాన్ని ఎన్నిసార్లు మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారని ధ్వజమెత్తారు. హద్దు మీరిన అబద్ధాలతో ఎన్నిసార్లు మభ్యపెట్టాలని చూస్తారని... ఓ పనికి శ్రీకారం చుట్టి దానిని లక్ష్యానికి చేర్చినప్పుడే అది వారి సమర్థతకు నిదర్శనం అవుతుందని పేర్కొన్నారు. అంతే తప్ప బీఆర్ఎస్ విజయాలను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకం ఎప్పటికీ విశ్వసించదని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.