Road Accident in Medak Today :మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఇవాళ (సెప్టెంబరు 10) జరిగింది. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళుతున్న లారీ చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన దొంతి భూదయ్య (తండ్రి), దొంతి మల్లేష్ (కొడుకు)లు ప్రయాణిస్తున్న బైక్ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందగా, బూదయ్యను తుప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు.
అనారోగ్యంతో తండ్రి - ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రమాదం - ఘటనలో ఇద్దరు దుర్మరణం
Published : Sep 10, 2024, 6:20 PM IST
LORRY ACCIDENT IN MEDAK DISTRICT (ETV Bharat)
అనారోగ్యంగా ఉన్న తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకే ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి చెందడంతో ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది. సమాచారం తెలుసుకున్న తుప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూఫ్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.