Jammu Kashmir LG on Pakistan: జమ్మూకశ్మీర్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు, పాకిస్థాన్ శిక్షణ పొందిన ఉగ్రవాదులను భారత్లోకి ఎగదోస్తోందని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా అన్నారు. జమ్ముకశ్మీర్లో ఇటీవల జరుగుతున్న వరుస ఉగ్ర ఘటనలు కలవరపెడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎల్జీ మనోజ్ సిన్హా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
'పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎగదోస్తోంది' - జమ్మూకశ్మీర్ ఎల్జీ
Published : Aug 12, 2024, 7:02 AM IST
'ఇటీవలి ఉగ్ర ఘటనలు బాధాకరం. వాటిని కచ్చితంగా నియంత్రిస్తాం. పాకిస్థాన్ ఉగ్రవాదానికి నిలయంగా మారింది. మన జమ్మూకశ్మీర్లోని శాంతిభద్రతలను అస్థిరపర్చేందుకు వారిని ప్రోత్సహిస్తోంది. పొరుగు దేశపు దుర్మార్గపు కుట్రలను విఫలం చేసేందుకు భద్రతా బలగాలు, పాలనా యంత్రాంగం ఒక వ్యూహాన్ని రూపొందించాయి. భారీ ఎత్తున బలగాలను మోహరిస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ వ్యూహాన్ని సమీక్షించారు. రానున్న రోజుల్లో కచ్చితంగా మంచి సత్ఫలితాలు ఉంటాయి' అని మనోజ్ సిన్హా పేర్కొన్నారు.