యాదాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవ వేడుకలు - రెండో రోజూ తరలివచ్చిన భక్తులు - Yadadri Brahmotsavams 2024
Published : Mar 12, 2024, 7:42 PM IST
Yadadri Brahmotsavams 2024 : రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా స్వామి వారి దేవతాహ్వానము, ధ్వజారోహనము ఘనంగా జరిగాయి. ధ్వజస్తంభం అధిపతి అయిన గరుక్మంతుని చిత్రపటానికి పసుపు, గంధం, కుంకుమలు, వేదమంత్రాలతో ఆహ్వానం చేశారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చారు.
కుంకుమ, పసుపులతో చేసిన అన్నపు ముద్దలను గరుక్మంతునికి నైవేద్యంగా సమర్పించారు. ముక్కోటి దేవతలకు స్వామి వారి కళ్యాణ ఆహ్వానాన్ని గరుక్మంతుని ద్వారా అందజేశారు. అర్చకులు వేదమంత్రాలతో స్వామి వారికి పూజలు నిర్వహించారు. గరుక్మంతునికి నైవేద్యంగా సమర్పించిన అన్నం ముద్దలను భక్తులకు పంచిపెట్టారు. ఈ అన్నం ముద్దలు సంతానం లేనివారి తింటే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. స్వామి వారిని దర్శించుకునేందకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో స్వామి వారిని ఊరేగించారు.