గ్రావెల్ మాఫియాకు నిరసన సెగ- 'ఊరును నాశనం చేయడానికే గెలిపించామా?': గ్రామస్థుల ఆగ్రహం - నెల్లూరు గ్రామస్థులు ఆందోళన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 12:40 PM IST
Villagers Protest Against Gravel Mining in Nellore: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం సంజీవనగర్లో గ్రావెల్ మాఫియాకు గ్రామస్థుల నుంచి నిరసన(Protest) సెగ తగిలింది. అధికార పార్టీ నేతల అండదండలతో అడ్డుఅదుపూ లేకుండా గ్రావెల్ తవ్వకాలు చేపట్టిన వారిని గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇష్టానుసారంగా గ్రావెల్ తవ్వకాలు (Gravel Mining) చేపట్టడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిప్పర్లను అడ్డుకున్నా గ్రావెల్ తరలించేందుకు యత్నించడంతో టిప్పర్ల కింద పడుకుని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో గ్రావెల్ మాఫియా, గ్రామస్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ తొవ్వి సొమ్ము చేసుకుంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా ఉన్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తొవ్వకాల వల్ల ఏర్పడిన గుంతలు వర్షాకాలంలో ప్రమాదభరితంగా మారుతున్నాయని గ్రామస్థులు పేర్కొన్నారు. కరెంట్ స్థంభాల చుట్టూ గ్రావెల్ తోడేయడంతో అవి ఎక్కడ పడుతాయోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గెలిపించిన నాయకులు ఊరును నాశనం చేస్తున్నారని గ్రామస్థులు మండిపడ్డారు. జిల్లా ఉన్నతాధికారులైనా స్పందించి గ్రావెల్ తవ్వకాలు అడ్డుకుని గ్రామాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరారు.