By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 6:53 PM IST
వైఎస్సార్సీపీ మద్యం టోకెన్లు- తిరుపతిలో జోరుగా పంపిణీ - Telugu youth leaders press meet
Telugu Youth Leaders Angry With Jagan : వైఎస్సార్సీపీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొత్తదారి ఎంచుకుంటున్నారని తెలుగు యువత నాయకులు ఆరోపించారు. టోకెన్లు ఇచ్చి మద్యం షాపులకు ఓటర్లను పంపుతున్నారని తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యపానం వల్ల పండుగ పూట కూడా మహిళల తాళిబొట్లు తెగిపోతున్నాయని ఇదే ఉగాది రోజున అన్నారు. అధికారంలోని వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యనిషేధం చేస్తానని చెప్పిన మాటలు గుర్తుచేశారు. తీర అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట తప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. అంతేగాక మద్యపాన నిషేధం చేసిన తరువాతే ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడుగుతానని చెప్పినవాడివి ఇప్పుడెలా సిగ్గులేకుండా అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ హయంలో వచ్చిన మందుబాటిళ్లను ఈ సందర్భంగా ప్రదర్శించారు. మద్యపానం నిషేధం పేరుతో గత ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్లను నిషేధించి కొత్త బ్రాండ్లను తీసుకువచ్చాడని తెలిపారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో వైసీపీ సానుభూతిపరులనే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమించుకున్నారని విమర్శించారు. మద్యం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోంచి తప్పించి ఎన్నికల కమిషన్ నియంత్రణలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అధికారులు లావాదేవీలపై దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలపై ఆడిటింగ్ జరపాలని కోరారు. ఇప్పటివరకు విక్రయించిన మద్యంపై శ్వేతపత్రం విడుదల చేయాలని రవి నాయుడు డిమాండ్ చేశారు.