ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అర్ధరాత్రి టీడీపీ నేత జయరాం నాయుడు అరెస్ట్​ - పోలీస్‌స్టేషన్‌ వద్ద టీడీపీ శ్రేణుల నిరసన - HIGH TENSION AT ANANTAPUR PS

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 12:56 PM IST

TDP Protest At Anantapur Police Station : అనంతపురంలో వైఎస్సార్సీపీ నేతపై జరిగిన హత్యాయత్నం కేసులో టీడీపీ నేత జయరాం నాయుడుని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్‌ చేశారు. జయరాం అరెస్ట్‌ విషయం తెలియడంతో టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నాయి. అరెస్ట్‌కు నిరసనగా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసుస్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జయరాంను అరెస్ట్‌ చేసి రాత్రి మొత్తం అన్ని పోలీస్‌స్టేషన్లలో తిప్పారని టీడీపీ నేత దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ అన్నారు. జయరాంను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని దగ్గుపాటి డిమాండ్‌ చేశారు. 

నెల రోజుల కిందట వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరామని జయరాం సతీమణి తెలిపారు. దీనిని మనసులో పెట్టుకొని వైఎస్సార్సీపీ నాయకులు హత్యాయత్నం కేసులో ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆదేశాలతో డీఎస్పీ రాఘవరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం టీవీ టవర్‌ సమీపంలో కొందరు దుండగులు తన కళ్లలో కారం కొట్టి హత్య చేయడానికి యత్నించారని వైఎస్సార్సీపీ నేత నగేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జయరాంను అదుపులోకి తీసుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details