By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 16, 2024, 12:12 PM IST
ఐదేళ్లుగా పల్నాడులో వైఎస్సార్సీపీ అరాచకాలు- రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలు
TDP Families Away From Their Villages Due To YSRCP Anarchy: వైఎస్సార్సీపీ అరాచకాలకు భయపడి ప్రజలు ఊళ్లు విడిచి వెళ్లిపోయిన వారికి తాజాగా హైకోర్టు నుంచి ఊరట లభించింది. బాధితులకు పొలీసులు రక్షణ కల్పించి సొంత గ్రామాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దీంతో బాధితులు ఒకొక్కరుగా గ్రామాల్లో అడుగు పెడుతున్నారు.
పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ అరాచకాల వల్ల తెలుగుదేశం నాయకులు ఊళ్లు వదిలి వెళ్లిపోయారు. కొందరు బాధితులు హైకోర్టును ఆశ్రయించగా వారికి భద్రత కల్పించి గ్రామాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టుల పోలీసులను ఆదేశించింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే గత ఎన్నికల్లో మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో తెలుగుదేశం తరఫున క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలపై వైఎస్సార్సీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ బెదిరింపులు వల్ల కొన్ని కుటుంబాలు గ్రామాలు వదిలిపెట్టి వెళ్లిపోయాయి. వారికి రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. గడిచిన ఐదేళ్లలో వారు ఊరికి దూరంగా ఉంటూ పొలాల్ని బీళ్లు పెట్టేవారు. ఇళ్లు పాడైపోయాయి. తాజాగా హైకోర్టు ఉత్తర్వులతో వారు ఒక్కొక్కరుగా గ్రామాలకు చేరుకుంటున్నారు. 4 రోజుల నుంచి 16 మంది గ్రామాలకు చేరుకున్నారు. 48 మందికి రక్షణ కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు వచ్చాయని పోలీసులు తెలిపారు. కోర్టు ఉత్తర్వుల నకలు స్టేషన్లలో అందజేయగానే గ్రామాల్లో పోలీసు పికెట్లు (police Picket) పెట్టి బాధితులకు ఎన్నికలు ముగిసేవరకూ రక్షణ కల్పిస్తామని అధికారులు తెలిపారు.