నాలుగు రోజుల క్రితం ఇంటికి అక్కాచెల్లెళ్లు - అంతలోనే ఆత్మహత్య - Anantapur Sisters Committed Suicide
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 5:08 PM IST
Sisters Committed Suicide by Hanging in Anantapur: ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురంలో స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చాకలి నారాయణస్వామి రెండో భార్య సరస్వతిలకు జ్యోతి, రూప అనే ఇద్దరు కుమార్తెలు. వీరిద్దరూ జిల్లాలో శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన అక్కాచెల్లెళ్లు తల్లిదండ్రులు లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
పొరుగూరికి వెళ్లిన దంపతులు ఇంటికి ఫోన్ చేయగా ఎంతసేపటికి ఫోన్ తీయలేదు. అనుమానంతో పక్కింటి వారికి నారాయణస్వామి సమాచారం అందించారు. దీంతో ఇరుగు పొరుగువారు వెళ్లి ఇంటి తలుపులు బద్దలు కొట్టే సరికే అక్కాచెల్లెళ్లు విగతజీవులుగా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించటంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కళ్యాణదుర్గం ఆస్పత్రికి పంపారు. అక్కాచెల్లెళ్ల మృతికి కారణమైన వివరాలు తెలియాల్సి ఉంది.