8 నెలలు తరువాత బయటపడ్డ ఆలయం - ప్రత్యేక పూజలు - SANGAMESHWARA TEMPLE IN WATER
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2024, 6:46 PM IST
Sangameshwara Temple is Coming out of the water : నంద్యాల జిల్లాలోని సప్త నదుల సంగమ క్షేత్రం సంగమేశ్వరాలయం క్రమంగా నీటిలో నుంచి బయటపడుతోంది. ఏడాదికి 8 నెలలు నీటిలో ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. మిగిలిన 4 నెలలు ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు. శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల్లో ఉండే ఈ ఆలయం ప్రాజెక్టు నిండితే నీటిలో మునిగిపోతుంది. జలాశయంలో నీరు క్రమంగా తగ్గిపోతుండటంతో ఆలయ శిఖర భాగం బయటపడింది. ఆలయ పురోహితుడు రఘురామ శర్మ గుడి గోపురానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ క్రమంగా తగ్గిపోతుండటంతో సంగమేశ్వర ఆలయం రోజు రోజుకు బయటకు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆలయం గోపురం బయటపడుతోంది. రాష్ట్రంలోని ఇతరా దేవాలయాల్లో భక్తులు ఏడాది పొడవునా దైవ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ సంగమేశ్వరం ఆలయంలో మాత్రం ఏడాదిలో కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులు దర్శనం చేసుకునేందుకు సాధ్యం అవుతోంది. ఇక్కడి శ్రీశైలం ప్రాజెక్టు కారణంగా సప్త నదీ సంగమేశ్వరాలయం సంవత్సరంలో ఎక్కువ రోజులు కృష్ణమ్మ ఒడిలోనే ఉంటుంది. దేవాలయం పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరే ముందు శిఖర పూజలు నిర్వహిస్తారు. అలాగే ఆలయం బయటపడితే పూజలు చేస్తారు.