స్వర్ణ జలాశయానికి వరద నీటి ఉద్ధృతి - 3500 క్యూసెక్కుల నీటి విడుదల - flood water flow to swarna project
Published : Jul 25, 2024, 5:56 PM IST
Huge Flood Water Flow To Swarna Project : నిర్మల్ జిల్లా స్వర్ణ జలాశయానికి నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో ఎడతెరిపిలేని వర్షాలకు వరదనీరు చేరి జలకళను సంతరించుకుంది. స్వర్ణ డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు (1.484 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1180 అడుగులకు(1.154 టీఎంసీ) చేరింది. జలాశయంలో 3000 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు ఒక వరద గేట్ ద్వారా 3500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
స్వర్ణ జలాశయాన్ని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల సందర్శించారు. వరదనీరు విడుదలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాగు పరివాహక ప్రాంతాల్లో వరద సమస్యలు తలెత్తితే సంబంధిత సమాచారాన్ని పోలీసువారికి తెలియపరచాలని ఆమె స్థానికులను కోరారు. సహాయక చర్యలకు సంబంధించి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లుగా ఎస్పీ వివరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జలాశయాలకు వరదనీరు చేరింది. దీంతో ఆయా ప్రాజెక్టుల గేట్లు తెరిచి అధికారులు నీటిని విడిచిపెట్టారు.