రంగబాబుపై దాడి కేసులో నిందితుల అరెస్టు - పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం - నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 11:32 AM IST
Police Has Arrested The Accused in TDP Leader Attack Case: గన్నవరంలో తెలుగుదేశం నేత కాసరనేని రంగబాబుపై దాడి కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన జునైద్, జహీర్, ఫర్హాన్, రాజు, చిరంజీవిలను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసుతో ఎటువంటి సంబంధం లేని ముగ్గిరాల చిరంజీవిని ఏ1గా చేర్చి పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుగుదేశం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
నిందితులు వినియోగించిన కారు వివరాలను టీడీపీ నాయకులు బయటపెట్టారు. దాడికి పాల్పడిన నిందితులు గతంలో అంపాపురం కోడిపందేలు, జూదం నిర్వహణలో బౌన్సర్లుగా వ్యవహరించినట్లు వివరించారు. రంగబాబుపై నిందితులు దాడి చేయడానికి గల కారణాలు ఏమిటి అసలు దీని వెనుక ఎవరున్నారన్న విషయాలేమీ వెల్లడించకుండా కోర్టుకు తీసుకువెళ్లడం వెనుక అంతర్యం ఏమిటని నేతలు ప్రశ్నించారు. త్వరలో తాము సేకరించిన ఆధారాలతో హైకోర్టులో ప్రైవేట్ కేసు వేయనున్నట్లు నాయకులు గురువారం వెల్లడించారు. వాస్తవాలు కప్పిపుచ్చి కేసును తప్పుదోవ పట్టించిన ప్రతి ఒక్క పోలీసు అధికారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.