రషీద్ హత్య కేసులో మరో ఆరుగురు అరెస్టు - మరికొందరి కోసం గాలింపు - Six Persons Arrest in Rashid Case - SIX PERSONS ARREST IN RASHID CASE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 26, 2024, 8:25 AM IST
Police Arrested Six Accused in Rashid Murder Case : పల్నాడు జిల్లా వినుకొండలో సంచలనం సృష్టించిన రషీద్ హత్య కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ నెల 17న వినుకొండలోని ముండ్లమూరు బస్టాండు వద్ద రషీద్ హత్య జరగగా ప్రధాన నిందితుడైన జిలానీని ఆ తర్వాత రోజే అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపించినట్లు వినుకొండ సీఐ సాంబశివరావు తెలిపారు. జిలానీతోపాటు మరో ఆరుగురి ప్రమేయం ఉందని గుర్తించి నిందితులను అరెస్టు చేశామన్నారు. మరికొందరిని పట్టుకోవడానికి ఎస్పీ, డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు.
వినుకొండ నగరంలో జిలాని అందరూ చూస్తూ ఉండగానే కొబ్బరి బొండాల కత్తితో అతికిరాతకంగా రషీద్ను నరికి చంపాడు. ఈ ఘటనకు వారి మధ్య విభేదాలే కారణమని పోలీసులు తెలిపారు. రెండేళ్ల క్రితం జరిగిన ఓ గొడవలో తనపై అన్యాయంగా కేసు పెట్టి జైలుకి పంపించాడని అందువల్ల రషీద్పై జిలానీ పగ పెంచుకున్నాడు. సమయం చూసి నడిరోడ్డుపై కర్కశంగా నరికి చంపాడు. పోలీసులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.