విశాఖలో రూ.500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా - కలెక్టర్కు జనసేన నేత పీతల మూర్తియాదవ్ ఫిర్యాదు
By ETV Bharat Andhra Pradesh Team
Published : 4 hours ago
Peethala Murthy Yadav Complaint on Govt Land Grab in Visakha: విశాఖ నగరం చిన్నగదిలిలో వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. చిన్నగదిలిలోని సర్వే నెం-13,21&26లోని 7.95 ఎకరాల భూమి సుమారు 500 కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని విశాఖ డైరీ యాజమాన్యం కబ్జా చేసిందని వివరించారు. రైతుల పేరు మీద చేసిన ఈ అక్రమాలపై విచారణ త్వరితగతిన జరిపితే వాస్తవాలు బయటికి వస్తాయని కలెక్టర్కు మూర్తి యాదవ్ వివరించారు. అలాగే జగన్ హయాంలో వైఎస్సార్సీపీ నేతలు విశాఖను దోచుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా కబ్జా చేశారని అన్నారు. వారి అరాచకాలను ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని మూర్తి యాదవ్ ఆరోపించారు.