By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 8:11 PM IST
డీజీపీ హరీష్ కుమార్తో సిటిజన్ ఫోరం ప్రతినిధుల భేటీ- ప్రశాంత పోలింగ్కు వినతి - CFD Complained to DGP
Nimmagadda Ramesh Complained to DGP: మచిలీపట్నం,పెనమలూరులో దాడి ఘటనల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేసినట్లు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని సీఎఫ్డీ ప్రతినిధులు డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు. దళితులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అక్రమాలు, దౌర్జన్యాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఈ దాడులు చేసినవారు ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రమేశ్ అన్నారు.
పోలీసు అధికారులు వైసీపీ నేతల కొమ్ముకాస్తున్నారని సీఎఫ్డీ కార్యదర్శి లక్ష్మణ రెడ్డి అన్నారు. ఉద్యోగులు బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాల్లో సమస్యలు ఎదుర్కొవటం అధికారుల పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. బ్యాలెంట్ ఓటింగ్ సమర్థంగా నిర్వహించాలని సూచించినట్లు నిమ్మగడ్డ రమేశ్ తెలిపారు. ఎటువంటి ఆటంకం కలగకుండా బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించి అధికారులు చిత్తశుద్ది నిరూపించుకోవాలని ఆయన కోరారు.