నాగార్జున సాగర్కు భారీగా వరద ప్రవాహం - 8 గేట్లు ఎత్తి నీటి విడుదల
By ETV Bharat Andhra Pradesh Team
Published : 6 hours ago
Nagarjuna Sagar Gates Lifted Today : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పల్నాడు జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పై నుంచి వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తారు. ఒక్కొ గేటును 5 అడుగుల మేర ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. 64,800 క్యూసెక్కుల వరద నీటిని ప్రాజెక్టు అధికారులు దిగువకు పంపిస్తున్నారు.
నాగార్జున సాగర్ జలాశయానికి 1,08,782 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.