ప్రకాశం బ్యారేజీ విధ్వంసానికి కుట్ర పన్నిన వారిని వదిలేది లేదు : మంత్రి నిమ్మల - Nimmala Inspected Prakasam Barrage - NIMMALA INSPECTED PRAKASAM BARRAGE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 11, 2024, 2:21 PM IST
Minister Nimmala Ramanaidu Inspected Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ గేట్ల విధ్వంసానికి కుట్ర పన్నిన వారిని వదిలేది లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న పడవలను తొలగించే పనులను ఆయన పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ లక్షల ఎకరాలకు, వేల మంది రైతులకు జీవనాధారమైన ప్రకాశం బ్యారేజ్ విధ్వంసానికి కుట్ర పన్నడం దారుణమన్నారు.
ప్రకాశం బ్యారేజ్ను కూల్చాలన్న కుట్రతోనే వైఎస్సార్సీపీ నేతలు కుట్ర పన్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఎగువ నుంచి 40 టన్నుల బరువున్న భారీ పడవలు ప్రకాశం బ్యారేజ్ వైపు పంపారని అవి 67, 69, 70 గేట్ల వద్ద 17 టన్నుల బరువున్న కౌంటర్ వెయిట్లను ఢీ కొట్టి ధ్వంసం చేశాయని ధ్వజమెత్తారు. 40 టన్నులు ఉన్న ఒక్కోక్క బోటును మూడు బోట్లుగా కలిపి 120 టన్నుల కెపాసిటీకి పెంచి ప్రకాశం బ్యారేజ్కి పంపడం దుర్మార్గమన్నారు.