వైఎస్సార్సీపీ నేతల ధోరణి దొంగే దొంగ అన్నట్లుగా ఉంది: పార్థసారథి - Minister Kolusu Partha Saradhi
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 13, 2024, 7:34 PM IST
Minister Kolusu Partha Saradhi in Eluru: వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రజలకు ఉపయోగకరమైన ఎన్నో పనులు నిలిచిపోయాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును సైతం చంద్రబాబుకు పేరొస్తుందనే కారణంతో గత ప్రభుత్వం మధ్యలోనే ఆపేసిందని మంత్రి విమర్శించారు. ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించి కూటమికి బ్రహ్మరథం పట్టిన రాష్ట్ర ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
వేధింపులు, కక్ష సాధింపులకు వెళ్లకుండా ప్రజలకు మంచి చేసేందుకు అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటామని వెల్లడించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారంటూ విష ప్రచారం చేస్తున్నారని పార్థసారధి అన్నారు. దాడుల విషయంలో వైఎస్సార్సీపీ ధోరణి దొంగే దొంగ అన్నట్లు ఉందని ఆయన మండిపడ్డారు. నిజానికి దాడులు చేస్తుంది వైఎస్సార్సీపీ నేతలేనని విమర్శించారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.