గీత కార్మికులకు శుభవార్త - 15 రోజుల్లో మద్యం షాపుల కేటాయింపు - LIQUOR PRICE IN AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 31, 2024, 3:48 PM IST
Minister Kollu Ravindra on Liquor Price : రాష్ట్రంలో మద్యం ధరల స్థిరీకరణకు త్వరలోనే టెండర్ కమిటీ వేస్తామని రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మ్యానుఫ్యాక్చర్ డిస్టిలరీస్తో టెండర్ కమిటీ సంప్రదింపులు జరిపి మద్యం ఎంఆర్పీ రేట్లు నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఇప్పటికే క్వాలిటీ మద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని గుర్తు చేశారు. అత్యంత పారదర్శకంగా దుకాణాలు కేటాయించి మద్యం విక్రయాలు ప్రారంభించామని తెలిపారు. మద్యం దుకాణాలు పాఠశాలలు, దేవాలయాలకు దూరంగా ఏర్పాటు చేయించామని, ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరకే క్యాలిటీ లిక్కర్ విక్రయిస్తున్నారని తెలిపారు
15వ తేదీ లోపు ఈ దుకాణాల కేటాయింపు : గీత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు వారం రోజుల్లోనే 340 మద్యం దుకాణాల కేటాయింపునకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే నెల 15వ తేదీలోపు ఈ దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలన్న దృక్పథంతో ప్రభుత్వం ఉందని మంత్రి రవీంద్ర తెలిపారు.