కొత్తపల్లి గీతకు ఊరట - ఎన్నికల్లో పోటీకి వీలు కల్పించిన తెలంగాణ హైకోర్టు - Kothapally Geetha
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 11, 2024, 8:28 PM IST
Kothapally Geetha Gets Relief in Telangana High Court : మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఓ కేసులో సీబీఐ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షపై న్యాయస్థానం స్టే విధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేశారంటూ అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త, బ్యాంకు అధికారులపైనా సీబీఐ అధికారులు 2015లో కేసు నమోదు చేసి రుజువు చేశారు. దీంతో సీబీఐ కోర్టు కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్త, మరో ముగ్గురిని దోషులుగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సెప్టెంబర్ 13, 2022న తీర్పునిచ్చింది.
సీబీఐ తీర్పును కొత్తపల్లి గీత తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. 2014లో ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత మరోసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల కొత్తపల్లి గీత పోటీ చేయడానికి అనర్హులయ్యే అవకాశం ఉందన్నారు. దీంతో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.