By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 2, 2024, 1:35 PM IST
జగన్ సొంత జిల్లాలో అస్తవ్యస్తంగా జగనన్న ఇళ్లు- టీడీపీ సానుభూతిపరులకు నిరాకరణ - Atluri mandal jagananna house
Jagananna Colony House Constructions Incomplete at YSR district: పేదలందరికీ నిష్పక్షపాతంగా ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు నీటి మూటలుగా మిగిలాయి. నాసిరకం నిర్మాణాలతో లబ్ధిదారులకు కన్నీళ్లు మిగిల్చాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జగనన్న కాలనీ బాధితులు నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం సొంత జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలాయి. వైఎస్సార్ జిల్లా బద్వేలు, అట్లూరు మండలాల్లో ఇళ్లపట్టాలు వచ్చినప్పటికీ అద్దె ఇళ్లలో ఉంటున్నామని లబ్ధిదారులు వాపోయారు. లబ్ధిదారులు రూ. 35,000 ఇస్తే పిల్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని అధికారులు తెలిపడంతో కూలీ చేసుకొని పోగేసుకున్న డబ్బును చెల్లించామని అయితే ఇంతవరకు నిర్మాణం పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మించిన ఇల్లు అత్యంత నాసిరకంగా ఉండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
"ఇంటి పట్టా ఇచ్చారు. కాలనీకి వెళ్తే ఇళ్లు లేదని చెబుతున్నారు. టీడీపీ సానుభూతి పరులని అందుకే నిరాకరిస్తునట్టు తెలిపారు. ఇళ్లు నిర్మించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేదు. పేరుకే కాలనీ కాని ఆ ప్రదేశం నివాసయోగ్యంగా లేదు."
-స్థానికులు