గ్రాము బంగారంతో పంచారామాలు - శివునిపై భక్తిని చాటుకున్న స్వర్ణకారుడు - Goldsmith Made Shiva Pancharamas
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 8, 2024, 2:24 PM IST
Goldsmith Made Lord Shiva Pancharamas: శివరాత్రి వచ్చిందంటే ఒక్కొక్కరూ ఒక్కో విధంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటారు. తమ భక్తిని చాటుకుంటారు. ఇందుకు భిన్నంగా ఓ స్వర్ణకారుడు వివిధ రకాల శివుని రూపాలను తయారు చేసి అబ్బుర పరుస్తున్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుంటకు చెందిన వైదాసు శ్రీనివాసరావు అనే స్వర్ణకారుడు తన శివ భక్తిని చాటుకున్నారు. గత పది సంవత్సరాలుగా ఇదే విధానాన్ని కొనసాగిస్తూ పలు రకాల శివ రూపాలను సూక్ష్మ చిత్రాలుగా తయారు చేస్తున్నారు.
ఇప్పటికే శివపార్వతులు, నందీశ్వరుడు, శివలింగాలు, తదితర ఆకృతులను వెండి, బంగారు తీగలతో తయారు చేసి అలరించారు. తాజాగా ఈ ఏడాది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒక్క గ్రాము బంగారంతో ఐదు సూక్ష్మ శివ లింగాలను రూపొందించారు. రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, అమరారామం, క్షీరారామం, సోమరామం, కుమారరామం శివలింగాల నమూనాలను అతి తక్కువ పరిమాణంలో రూపొందించి తన ప్రతిభను చూపారు. భవిష్యత్తులో మరిన్ని సూక్ష్మ ఆకృతులను తయారు చేసి గుర్తింపు తెచ్చుకుంటానని శ్రీనివాసరావు పేర్కొన్నారు.