Published : Jun 25, 2024, 3:46 PM IST
సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ సూత్రాన్ని పాటిస్తున్నారు : వినోద్ కుమార్ - Former MP Vinod Kumar allegations
Vinod Kumar Allegations Against CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ సూత్రాన్ని పాటిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. పదేళ్ల కేసీఆర్ హయాంలో సైనిక పాఠశాల గురించి అడగలేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రానికి సైనిక పాఠశాల ఇవ్వాలని కడియం శ్రీహరి, జితేందర్ రెడ్డి, తాను, ఇతరులం ఎన్నోమార్లు అడిగామని తెలిపారు. సైనిక పాఠశాల కోసం కేసీఆర్ రాసిన లేఖలు సీఎం కార్యాలయంలో ఉన్నాయని, కావాలంటే చూడాలని పేర్కొన్నారు. వరంగల్లో సైనిక పాఠశాల ఏర్పాటు కోసం అంతా సిద్ధమైన తరుణంలో కేంద్రం కొర్రీ వేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఖర్చు పెట్టుకున్నా, ప్రైవేట్ సంస్థలు నడిపినా అనుమతి ఇస్తామని కేంద్రం చెప్పినట్లు గుర్తు చేశారు. ఆ షరతులు సడలించాలని కేసీఆర్ గుర్తు చేసినట్లు పేర్కొన్నారు.
అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్నికలకు ముందు అబద్దాలతో ఇలాగే నిరుద్యోగ యువతను రెచ్చగొట్టారన్న వినోద్ కుమార్, ఇక నుంచి గోబెల్స్ ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కంటోన్మెంట్ పరిధిలో డబుల్ డెక్కర్ కారిడార్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. నీట్లో ఉండబోమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ కోరారు.