ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిసిన సీతాదేవి అంత్యక్రియలు - నివాళులర్పించిన పలువురు నేతలు - Former Minister Sitadevi Funeral
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 29, 2024, 3:42 PM IST
Former Minister Sitadevi Funeral in Konduru: ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండూరులో మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి అంత్యక్రియలు ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. ఏలూరు ప్రత్యేక బెటాలియన్ పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, వడ్డే శోభనాద్రీశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ, విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని అంజనేయులు సీతాదేవి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
సీతాదేవి పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పలు పార్టీలకు చెందిన నాయకులు తరలివచ్చారు. విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి సోమవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్లో మృతి చెందారు. సీతాదేవి ముదినేపల్లి నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా 2సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఎన్టీఆర్ క్యాబినెట్లో ఆమె మంత్రిగా పని చేశారు. సీతమ్మ మరణవార్తతో కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కొండూరు ప్రజలు సైతం కన్నీటి పర్యంతమయ్యారు.