కోనసీమలో దారుణం - అనుమానంతో కుమార్తెను కడతేర్చిన తండ్రి - Father Killed His Daughter - FATHER KILLED HIS DAUGHTER
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 13, 2024, 10:07 AM IST
Father Killed His Daughter in Konaseema District : అనుమానంతో కన్నకూతురినే కత్తితో నరికి కడతేర్చిన తండ్రి కటకటాల పాలైన ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కలకలం రేపింది. ఐ. పోలవరం మండలం పాత ఇంజరంలో ఆదివారం ఉదయం మదాసు శివ సుబ్రహ్మణ్యం తన కూతరు రాణి (27) ఎవరితోనో ఫోనులో మాట్లాడుతుండగా కత్తితో ఆమె మెడపై వేటు వేయడంతో అక్కడికక్కడే కుప్ప కూలి పడిపోయింది. రక్తపు మడుగులో ఉన్న రాణిని స్థానికులు యానాంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి కాకినాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
హత్యకు పాల్పడిన శివసుబ్రహ్మణ్యంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం, కౌలు రైతైన మదాసు శివసుబ్రహ్మణ్యం వేధింపులు తాళలేక పదేళ్ల క్రితం భార్య కాసు ఆత్మహత్యకు పాల్పడింది. కొడుకు వేరేగా ఉంటున్నాడు. కూతుర్లు రాణి, మదర్ థెరిస్సా తండ్రితో కలిసి ఉంటున్నారు. పెద్దకూతురు రాణి తరచూ ఫోనులో మాట్లాడుతుండడంతో అనుమానం పెంచుకుని కత్తితో కర్కశంగా నరికి చంపడంతో గ్రామంలో విషాదం నెలకొంది.