ఏపీ పోలీసుల చెవికెక్కని ఈసీ ఆదేశాలు - నానిపై హత్యాయత్నం కేసులో అనుమానాలెన్నో! - Attack on Pulivarthi Nani - ATTACK ON PULIVARTHI NANI
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2024, 4:21 PM IST
Attack on Pulivarthi Nani : వైఎస్సార్సీపీ నాయకులతో ప్రభుత్వ అధికారులు, పోలీసులు అంటకాగుతున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా కొందరు అధికారుల తీరులో మార్పు రావడం లేదు. తిరుపతి జిల్లా శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నంపై పోలీసు అధికారులపై ఈసీ చర్యలు చేపట్టింది. అయినప్పటికీ మరికొందరి అధికారుల తీరులో మార్పు రావడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. నానిపై దాడి జరిగిన రోజు సీసీ పుటేజీని పరిశీలించి దుండగులు లోనికి ఎలా ప్రవేశించారు? హత్యాయత్నం తర్వాత ఎలా పారిపోయారు? అనే విషయాలపై దృష్టి పెట్టకుండా కేసును పురోగతిలోకి తీసుకెళ్లకుండా పోలీసులు జాప్యం చేస్తున్నారు.
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రోత్సాహంతోనే తనపై హత్యాయత్నం జరిగిందని నాని ఆరోపించారు. అయితే నిందితులను గుర్తించేందుకు వినియోగించాల్సిన సీసీటీవీ పుటేజ్ లను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ వీడియోలను ఎలా అందించారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 25వ తేదీన ఆ సీసీ పుటేజ్ చూపిస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నానిపై జరిగిన హత్యాయత్నం విషయంలో వాటిని కనీసం పరిగణలోకి తీసుకోని పోలీసులు దాడి అనంతరం టీడీపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన పుటేజీలను మాత్రం చెవిరెడ్డికి ఎలా అందించారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.