సిద్ధం సభ విజయవంతం అయితే మీడియాపై దాడులెందుకు?: బోండా ఉమా - Bonda Umamaheswara Rao Comment
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 9:58 PM IST
Bonda Umamaheswara Rao Comment on CM Jagan : సిద్ధం సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు చంద్రబాబు సవాల్ విసిరినా ఎందుకు మాట్లాడటం లేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. సభల్లో మాట్లాడేసి తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్లి తలుపులేసుకుంటే సరిపోతుందా అని మండిపడ్డారు. తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టి జగన్ను బయటకు రప్పించి సమాధానం చెప్పిస్తామన్నారు. జగన్ చెప్పినట్టు ఫ్యాన్ లోపలే ఉంటుంది, సైకిల్ ప్రజల మధ్య ఉంటుందన్నారు.
99 శాతం హామీలన్ని నెరవేర్చినట్టు జగన్ బుకాయిస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు, మద్యపానం నిషేధం, ఏటా జాబ్ క్యాలెండర్, బీసీ, ఎస్సీ, ఎస్సీ నిధులు ఎక్కడా అని బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. తాము ఎక్కడైనా చర్చకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. సిద్ధం సభ విజయవంతం అయితే మీడియాపై దాడులెందుకు చేస్తున్నారని బోండా ఉమా నిలదీశారు. అభివృద్ధి, సంక్షేమానికి మారుపేరు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. జగన్ అంటే విధ్వంసం, జైలు అని ధ్వజమెత్తారు. జగన్ను ఇంటికి పంపే రోజులు దగ్గర పడిందన్నారు.