మూడు దశాబ్దాల తర్వాత ఏకమైన కుటుంబాలు- జగన్ను ఓడించేందుకేనా? - Two families united win elections - TWO FAMILIES UNITED WIN ELECTIONS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 11, 2024, 7:24 AM IST
Bhuma- Irigela Families Were United in Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తరతరాలుగా శత్రు వర్గాలుగా ఉన్న భూమా- ఇరిగెల కుటుంబాలు ఏకమయ్యాయి. టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి చొరవ తీసుకుని ఇరు వర్గాలను కర్నూలుకు పిలిపించి విడివిడిగా చర్చలు జరిపారు. ఎన్నికల నేపథ్యంలో రెండు కుటుంబాలు ఏకం కావాలని కోరారు. జగన్ను ఓడించటానికి ఏకం అవుతున్నట్లు భూమా అఖిలప్రియ, ఇరిగెల రాంపుల్లారెడ్డి స్పష్టం చేశారు. ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ గెలుపు కోసం కృషి చేస్తానని ఇరిగెల ప్రకటించారు.
1992లో ఆళ్లగడ్డ ఉప ఎన్నిక గెలుపును టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీడీపీ నుంచి భూమా నాగిరెడ్డి, కాంగ్రెస్ నుంచి గంగుల ప్రభాకర్రెడ్డి బరిలో దిగారు. విజయం సాధించాలన్న లక్ష్యంతో నేరుగా ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. అప్పటి సీనియర్ టీడీపీ నేతలు జమ్మలమడుగు ఎమ్మెల్యే గుళ్లకుంట శివారెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ మధ్యవర్తిత్వంతో ఇరిగెల కుటుంబం టీడీపీ విజయానికి కృషి చేసింది. ఆ ఉప ఎన్నికలో భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. అప్పుడు రెండు కుటుంబాలు కలిసి పనిచేయడంతో గెలుపు నల్లేరుపై నడకగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. ప్రస్తుతం మళ్లీ మూడు దశాబ్దాల తర్వాత మరోసారి ఈ రెండు కుటుంబాలు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి చొరవతో ఏకమయ్యాయి.