Vallabhaneni Vamsi Remand: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. సత్యవర్థన్ను బెదిరించిన కేసులో వంశీతోపాటు మరో ఇద్దరు నిందితులకు రిమాండ్ విధించడంతో వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. సత్యవర్థన్ను బెదిరించిన కేసులో వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.
వైఎస్సార్సీపీ హయంలో అధికారం అండతో రెచ్చిపోయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేయగా, న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. వంశీతోపాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో నాటకీయ పరిణామాల మధ్య వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు.
కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వ్యవహారంలో వంశీతోపాటు మరికొందరిపైనా విజయవాడ పటమట స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పోలీసు బృందం హైదరాబాద్ చేరుకుంది. రాయదుర్గంలో వంశీ నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజాము వెళ్లి ఆయన ఇంటి తలుపు తట్టారు. కేసు వివరాలు వివరించి అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన వంశీ, ముందస్తు బెయిల్ పిటిషన్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అరెస్ట్ వారెంట్ చూపడంతో వెనక్కి తగ్గారు.