Alert on Social Media Friendships :నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్ సర్వసాధారణమైంది. సమయం దొరికితే చాలు ఆన్లైన్లో ఉండాల్సిందే. ఇక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. హద్దులు దాటనంతవరకు అవి బాగానే ఉన్నా, కొన్ని సార్లు ఆ పరిచయాలే కొంపముంచుతున్నాయి. ఎందుకంటే కొందరు కేటుగాళ్లు యువతులు, మహిళలకు మాయమాటలు చెప్పి నయవంచనకు పాల్పడుతున్నారు. చివరికి తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు.
Women Missing Cases in AP : ఏపీలో ఇలాంటి ఘటనలు కలవరపెడుతున్నాయి. ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థినులు అప్పటి వరకు తల్లిదండ్రుల చాటుబిడ్డలుగా ఉంటుంటారు. కానీ ఒక్కసారిగా అపరిచిత వ్యక్తులతో ఏర్పడిన పరిచయాలు, ప్రేమ వ్యవహారాలతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. తెలియని వారితో తమ పిల్లలు వెళ్లడం వారు ఏమైపోతున్నారోనన్న ఆందోళన పేరెంట్స్లో నెలకొంటోంది. దీంతో వారు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతం : ఇలాంటి ఘటనలపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు కానిస్టేబుల్ను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పంపుతున్నారు. ఇలా వారికి వెతకడానికి ఒక్కోసారి రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఓ పక్క పిల్లలు ఏమయ్యారోనన్న వేదన, మరో పక్క వెతకడానికి ఆర్థిక భారం. ఇంకోవైపు పరువు పోయిందన్న బాధ. ఇలా తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారుతున్నాయి. చదువుకునే సమయంలో ప్రేమ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లి వారి భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు.
విద్యార్థినులు, యువతులు ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న అదృశ్య కేసుల్లో ఎక్కువగా ప్రేమ వ్యవహారాలే ఉంటున్నట్లు పోలీసులు అంటున్నారు. మైనార్టీ తీరిన వారు తల్లిదండ్రులను ఎదిరించే స్థాయికి చేరుతున్నారని చెబుతున్నారు. మరోవైపు పోలీస్స్టేషన్లో కేసు పెట్టినా తాము మేజర్లమని చెబుతూ, తిరిగి రాని పరిస్థితులు నెలకొంటున్నాయని వారు అంటున్నారు.
రాష్ట్రంలో జరిగిన ఘటనలు :
- ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వద్దకు ఓ బాధితురాలు వచ్చింది. తన 16 ఏళ్ల కుమార్తెను ఓ యువకుడు తీసుకెళ్లి తొమ్మిది నెలలు అయిందని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నలిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం స్పందించి. దీనిపై వెంటనే పవన్ స్పందించారు. పోలీస్ అధికారులతో మాట్లాడారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు తొమ్మిది రోజుల్లో కశ్మీర్లో ఉన్న బాలిక ఆచూకీని కనుగొని తల్లికి అప్పగించారు. పోలీసులు దృష్టిపెడితే మిస్సింగ్ కేసులను ఛేదించడంలో చురుగ్గా వ్యవహరిస్తారని ఈ ఉదంతం తేటతెల్లం చేసింది.
- వైఎస్సార్సీపీ హయాంలో మహిళా అదృశ్యం కేసులు పెరిగిపోతున్నాయని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వీటిని అరికట్టాలని ఆయన గతంలో చాలా సార్లు ప్రస్తావించారు. దీనిపై కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వీటిపై దృష్టి సారించింది. మిస్సింగ్ కేసులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ అధికారులకు హోంశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి.
- ఇటీవల అనకాపల్లికి చెందిన యువతిని కొంతమంది యువకులు కిడ్నాప్ చేశారు. వారిలో ఓ యువకుడు అత్యాచారం చేశాడు. బాధిత తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి విచారిస్తుండగా ఆ అమ్మాయి ఇంటికి తిరిగొచ్చింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఇలా మిస్సింగ్ కేసు కాస్తా అత్యాచారం, కిడ్నాప్ కేసుగా మారడం అందరిలోనూ ఆందోళన కలిగించింది.
- అనకాపల్లికి చెందిన ఓ విద్యార్థిని ఫోన్లో పరిచయమైన యువకుడితో ఇతర రాష్ట్రానికి వెళ్లింది. అతడు మాయగాడని తెలుసుకుని తల్లిదండ్రులు, పోలీసుల సాయంతో ఇంటికి తిరిగి వచ్చింది.
- ఎలమంచిలికి చెందిన వివాహిత అపరిచిత వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే కుమారుడితో సహా ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త పోలీసులను ఆశ్రయించడంతో వెతగ్గా తిరిగి ఇంటికి చేరుకుంది.
- మాడుగుల మండలం డి.సురవరానికి చెందిన ఇంటర్ విద్యార్థినికి ఇన్స్టాగ్రాంలో ఓ యువకుడు పరిచయమయ్యాడు. అతడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కూలిపని చేసుకుని జీవించే తల్లిదండ్రులు కుమార్తె చేసిన పనికి తట్టుకోలేక అనారోగ్యం పాలయ్యారు.