South Coastal Railway zone : విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ను పూర్తిగా లేకుండా చేయడం సరికాదంటూ కేంద్రంపై కూటమి ప్రభుత్వ చేసిన ఒత్తిడి ఫలించింది. తాజాగా విశాఖపట్నం డివిజన్ ఏర్పాటుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కొత్త జోన్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు మాత్రమే ఉండేలా డీపీఆర్ సిద్ధమవుతోంది. తాజా నిర్ణయంతో ఇందులో విశాఖపట్నం డివిజన్ కూడా చేరనుంది. ఈ మేరకు ముసాయిదా డీపీఆర్ సిద్ధం చేయాలని జోన్ ప్రత్యేక అధికారికి ఆదేశాలు వెళ్లాయి. తుది డీపీఆర్పై బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోవాలి. దాదాపు ముసాయిదా డీపీఆరే ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వాల్తేరు డివిజన్లో ఉన్న ఒడిశా రాష్ట్ర పరిధిలోని ప్రాంతానికి రాయగడ కేంద్రంగా ఇప్పటికే కొత్త డివిజన్ ఏర్పాటు చేశారు. మిగిలిన భాగమంతా విజయవాడ డివిజన్ పరిధిలోకి వచ్చేలా డీపీఆర్ సిద్ధం చేస్తూ వచ్చారు. తాజాగా పలాస-విశాఖపట్నం-దువ్వాడ, కూనేరు-విజయనగరం-నౌపడ-పర్లాఖెముండి, బొబ్బిలి-సాలూరు, సింహాచలం నార్త్-దువ్వాడ బైపాస్, వడ్లపూడి-దువ్వాడ, విశాఖపట్నం స్టీల్ప్లాంట్- జగ్గయ్యపాలెం సెక్షన్లు కలిపి మొత్తం 410 కిలోమీటర్లతో విశాఖపట్నం డివిజన్ కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. కొత్తవలస-బచేలి టూ కిరండోల్, కూనేరు- తెరువలి, సింగ్పూర్రోడ్-కోరాపుట్, పర్లాఖెముండి-గుణుపూర్ సెక్షన్లు కలిపి 680 కిలో మీటర్ల రాయగడ డివిజన్ పరిధిలోకి వెళ్తాయి. ఈ డివిజన్ తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.
దక్షిణ మధ్య రైల్వే జోన్కు బదలాయింపు : మొన్నటి వరకు విశాఖ కేంద్రంగా ఉండే దక్షిణ కోస్తా రైల్వే జోన్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు మాత్రమే ఉంటాయని రైల్వే శాఖ పేర్కొంది. తాజాగా విశాఖపట్నం డివిజన్తో కలిపి నాలుగు డివిజన్లు ఉంటాయి. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు ఉంటాయి. తూర్పు కోస్తా రైల్వే జోన్లోకి ఖుర్దారోడ్, సంబల్పూర్, రాయగడ డివిజన్లు ఉన్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి 250 కిలోమీటర్లను దక్షిణ మధ్య రైల్వే జోన్కు బదలాయిస్తున్నారు. అలాగే దక్షిణ మధ్య జోన్లోని 46 కిలోమీటర్లు దక్షిణ కోస్తా జోన్కు తీసుకొస్తున్నారు.
గుంతకల్లు డివిజన్లోని రాయచూరు-వాడి మధ్య 108 కిలోమీటర్ల సెక్షన్ను దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్కు బదలాయించనున్నారు. దక్షిణ మధ్య, దక్షిణ కోస్తా, మధ్య రైల్వే జోన్లకు ఇంటర్ఛేంజ్ పాయింట్గా వాడి సెక్షన్ ఉంది. సికింద్రాబాద్ డివిజన్ నుంచి రాయచూరు-వాడి సెక్షన్లో ఉన్న యడ్లపూర్, ఎర్మరాస్ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు భారీగా బొగ్గు రవాణా చేస్తుంటారు. దీంతో ఈ సెక్షన్ను సికింద్రాబాద్ డివిజన్కు బదలాయించారు. ఏపీ- తెలంగాణ పరిధిలోని విష్ణుపురం- పగడిపల్లి, విష్ణుపురం- జన్పహాడ్ మార్గాల్లోని 142 కిలోమీటర్ల ఇప్పటి వరకు గుంటూరు డివిజన్ పరిధిలో ఉండేవి.
Vizag Railway Zone Updates :సింగరేణి బొగ్గు గనుల నుంచి విష్ణుపురం మీదుగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు రవాణాకు ఈ మార్గాలను వినియోగిస్తున్నారు. దీంతో వీటిని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి మారుస్తున్నారు. విజయవాడ శివారులోని కొండపల్లి- మోటుమర్రి సెక్షన్ 46 కిలోమీటర్లు ఇప్పటి వరకు సికింద్రాబాద్ డివిజన్లో ఉండేవి. నార్ల తాతారావు విద్యుత్ కేంద్రం, రాయనపాడు వర్క్షాప్లు దక్షిణ మధ్య, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల సరిహద్దులో ఉండగా, వీటిని పూర్తిగా దక్షిణ కోస్తా జోన్లోకి తెచ్చేందుకు వీలుగా ఆ 46 కిలోమీటర్లు విజయవాడ డివిజన్లోకి బదలాయిస్తున్నారు.