Two People Arrest in Photo Morphing Case In Srikakulam District:ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాలో అసభ్యకరమైన పోస్టుల పర్వం నానాటికీ పేట్రేగిపోతుంది. వీటిపై కఠిన చట్టాలు ఉన్నప్పటికీ ఇవి అదుపులోకి రావడం లేదు. యువతుల ఫొటోలను సేకరించి వాటిని ఇష్టారీతిగా మార్ఫింగ్ చేస్తూ వికృత ఆనందం పొందే కీచక గణం సమాజంలో మనకు ఎదురవుతూనే ఉంది. ఓ విద్యార్థిని ఫొటోలు, వీడియోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి తరచూ వేధింపులకు గురి చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా రెండో పట్టణ పరిధిలో చోటు చేసుకుంది.
అసలేమైందంటే? సీఐ ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ విద్యార్థిని తిరుపతిలో చదువుతున్న సమయంలో ఆ ప్రాంతానికి చెందిన షేక్ మహ్మద్ సోయల్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంలో అతనిని కలిసినప్పుడు ఆమెకు తెలియకుండా చిత్రాలు, వీడియోలు తీసేవాడు. కొన్నాళ్లకు వాటిని అశ్లీలంగా మార్ఫింగ్ చేసి తెలియని నంబరు నుంచి ఆమె వాట్సాప్ పంపుతూ వేధించేవాడు. బాధితురాలు తొలుత పరువు పోతుందని భావించినా ధైర్యం చేసి ఇటీవల రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తరువాత తెలిసిన వాళ్ల పనే అని నిర్ధరణకు వచ్చి దర్యాప్తును ముమ్మరం చేశారు.
విచారణలో భాగంగా సోయలే ఈ దారుణానికి ఒడిగట్టాడని తేలడంతో అతన్ని అదుపులోకి తీసుకుని సెల్ఫోన్ను పరిశీలించారు. విద్యార్థిని చిత్రాలు వీడియోలు మార్ఫింగ్ చేసి పోర్న్ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడని గుర్తించారు. అవే చిత్రాలు వివిధ సామాజిక మాధ్యమాల్లో సైతం చక్కర్లు కొడుతున్నాయని తెలుసుకుని సైబర్ సెల్ విభాగం దృష్టికి తీసుకెళ్లారు. వీటిని సిబ్బంది సంబంధిత యాజమాన్యాలకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఐడీలు, సెల్ఫోన్ నంబర్లు వచ్చాయి.