తెలంగాణ

telangana

13 గుళ్లలో చోరీలు రూ.70 లక్షల సొత్తు చోరీ - 400 సీసీటీవీ ఫుటేజీలతో కేసు ఛేదించిన పోలీసులు - Ratnalayam Temple Robbery case

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 2:54 PM IST

Ratnalayam Temple Robbery case : శామీర్​పేట్​ రత్నాలయం ఆభరణాలు చోరీ కేసులో నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ ముఠాయే 13 దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. పట్టుబడ్డవారి నుంచి రూ.70లక్షల విలువైన ఆలయ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

Ratnalayam Temple Robbery case
Ratnalayam Temple Robbery case (ETV Bharat)

Ratnalayam Temple Robbery Case: దేవాలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.70లక్షల విలువ చేసే బంగారు, పంచలోహ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో మేడ్చల్​ డీసీపీ ఎన్​. కోటిరెడ్డి వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :శామీర్​పేట్​ మండలం అలియాబాద్​ గ్రామ శివారు రాజీవ్​ రహదారి పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి(రత్నాలయం)లో ఈ నెల 24న అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. దేవాలయం వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించి విలువైన బంగారం, వెండి, కాంస్య విగ్రహాలను ఎత్తుకెళ్లారు. దీనిఫై పోలీసులకు ఫిర్యాదు అందింది.

కేసును సీరియస్​గా తీసుకున్న పోలీసులు శామీర్​పేట్​, జీనోమ్ వ్యాలీ, ఎస్​ఓటీ, సీసీఎస్​ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. దాదాపు 400 సీసీ కెమెరాల ఫుటేజీలను తనిఖీ చేశారు. దుండగులు ఓ రోజు రాత్రంతా వాహనాలపై తిరుగుతూ తెల్లవారుజామున ఒకచోట అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు.

మేడ్చల్​ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయకు చెందిన అనిల్​, మేడ్చల్​ పట్టణానికి చెందిన చింతాడ రాజు, రాంనగర్ చెందిన అస్లాం అలీ, షరీఫ్​లకు ఈ చోరీతో సంబంధం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వీరిలో అనిల్​, రాజు దేవాలయంలో చోరీ చేసిన వస్తువులను అస్లాం, షరీఫ్​లకు అమ్మారు. వారిపై నిఘా పెట్టిన పోలీసులు మేడ్చల్​ మండలం మున్షీరాబాద్​ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

ఆభరణాలు స్వాధీనం :నిందితుల నుంచి అమ్మవారి బంగారు లాకెట్, వెండి మంగళసూత్రాలు, వెండి ఖడ్గం, శఠగోపం, దండకం, కిరీటాలు, వడ్డాణం, నాగపడిగ, పంచలోహాంతో తయారు చేసిన శ్రీదేవి భూదేవి శ్రీనివాస ఉత్సవమూర్తి విగ్రహాలు నాలుగు, సుదర్శన చక్రం ఒకటి స్వాధీనం చేసుకున్నారు. 80 వేల నగదు, నాలుగు సెల్​ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.

13 దేవాలయాల్లో చోరీలు :గత మూడు నాలుగు నెలలుగా వీరు షామీర్పేట్, మేడ్చల్, జినోమ్ వ్యాలీ, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 13 దేవాలయాల్లో చోరీకి పాల్పడ్డారు. అప్పటినుండి తప్పించుకు తిరుగుతున్న నిందితులను ఎట్టకేలకు రత్నాలయం కేసులో పట్టుకున్నారు. ముగ్గురు నిందితులు పట్టుబడగా, షరీఫ్ పరారీలో ఉన్నాడు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని డీసీపీ అభినందించారు.

దొంగల నయా స్కెచ్.. తాళం పగలలేదు.. తలుపు విరగలేదు.. కానీ ఇంట్లోని 800 గ్రాముల బంగారం చోరీ

హనుమకొండ పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరీ - సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు - Temple Robbery In Hanamkonda

ABOUT THE AUTHOR

...view details