Special Story On Mallur Gutta :అరుదైన జాతుల ఔషధ మొక్కలకు నెలవు ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు గుట్ట. దీనిపై 500కు పైగా రకాల జాతుల ఔషధ మొక్కలున్నట్లు వృక్ష శాస్త్రవేత్తలు గుర్తించారు. యూఎన్డీపీ (యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం), వోఈఎఫ్(మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్) కలిసి చేపట్టిన ర్యాపిడ్ అసెస్మెంట్ సర్వేలో సుమారు 200 హెక్టార్లలో ఇవి విస్తరించి ఉన్నట్లు తెలిపారు. 2000లోనే గుట్టను ఔషధ మొక్కల పరిరక్షణ ప్రాంతంగా ప్రకటించారు. నేలతాటి, నేలగుమ్మడి, సరస్వతి, పిల్లడుగు తీగె, కాకిజంగా, ఈశ్వరి, దేవపత్రం, అడవి ఉసిరి, అడవి తులసి, కొండ పసుపు, అతుకుడు తీగె, మారేడు, శతావరి, తెల్లగురిజ, నేల ఉసిరి, నరమామిడి, సర్పగంధ- వంటి ఔషధ మొక్కలు గుట్టపై ఉన్నాయి. వీటిని మూలికా, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుంటారు.
హెర్బల్ పార్క్కు ప్రతిపాదన :గుట్టపై హెర్బల్ పార్క్ ఏర్పాటు చేయాలని 2000, 2018లో ప్రభుత్వానికి అటవీ శాఖ కోరింది. ఇటీవల కాలంలో అరుదైన మొక్కలు కనుమరుగవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మల్లూరు గుట్టను పరిశోధనలకు వేదికగా చేసుకోవాలని హనుమకొండకు చెందిన పర్యావరణవేత్త సుతారి సతీశ్ అంటున్నారు. వృక్ష శాస్త్రవేత్తలు, బోటనీ ప్రొఫెసర్లు, ఇతర నిపుణులతో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి సమగ్ర సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని ములుగు డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్ వివరించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఔషధ మొక్కల పరిరక్షణకు చర్యలు చేపడతామని వెల్లడించారు.