SERP CEO Veerapandian on Pension Distribution: రాష్ట్రవ్యాప్తంగా 88 శాతం పింఛన్లు పంపిణీ పూర్తి అయ్యిందని సెర్ప్ రాష్ట్ర సీఈవో వీర పాండియన్ చెప్పారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 93 శాతం మందికి పింఛన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. గత నెల పింఛను తీసుకోలేకపోయిన వారికి ఇవాళ రెండు నెలలది కలిపి చెల్లిస్తున్నామని అన్నారు. ఇలా గత నెల పించను తీసుకోలేకపోయిన వారు రాష్ట్రవ్యాప్తంగా 21,400 మంది ఉన్నారని తెలిపారు. భర్తను కోల్పోయిన వితంతువులకు వెంటనే పింఛను మంజూరు చేసేలా సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు.
భర్త చనిపోయిన వారికి మరుసటి నెల నుంచే వితంతు పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. ఇతర జిల్లాల్లో పింఛన్ పంపిణీ నెట్వర్క్ కారణంగా నిదానంగా జరుగుతోందని అన్నారు. డిసెంబర్ 1 ఆదివారం అయినందున శనివారం రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సెర్ప్ సీఈవో వీర పాండియన్ వెల్లడించారు.
CM Chandrababu in Pensions Distribution: అణగారిన వర్గాలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా నేమకల్లులో ఇంటింటికి పింఛన్ల పంపిణీలో సీఎం పాల్గొన్నారు. వితంతువు రుద్రమ్మ ఇంటికెళ్లిన సీఎం ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె కుటుంబసభ్యులతోనూ మాట్లాడారు. అనంతరం రుద్రమ్మకు స్వయంగా సీఎం పెన్షన్ అందించారు. ఇల్లు లేదని రుద్రమ్మ చెప్పడంతో వారికి వీలైనంత త్వరగా స్థలం కేటాయించి ఇల్లు కట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.