ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రయ్​మంటూ దూసుకెళ్లడమే - 4 గంటల్లోనే హైదరాబాద్​ టు విశాఖ!

శంషాబాద్‌-విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌

SEMI_HIGH_SPEED_RAIL_CORRIDOR
SEMI_HIGH_SPEED_RAIL_CORRIDOR (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 9 hours ago

Updated : 2 hours ago

Semi High Speed Rail Corridor between Shamshabad to Vizag :తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ప్రాజెక్టు ప్రణాళిక కీలక దశకు చేరుకుంది. శంషాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌ ఖరారైంది. సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ మార్గాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్​లో భాగంగా విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్‌ నిర్మించనున్నారు. ఈ కారిడర్​ విశాఖ నుంచి మొదలై సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ మీదుగా కర్నూలు చేరుతుంది. వీటి ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్‌ (PET) సర్వే తుది దశకు చేరుకుంది. ఈ సర్వే నివేదికను నవంబరులో రైల్వేబోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించనున్నట్లు సమాచారం.

4 గంటల్లోపే శంషాబాద్​ - విశాఖపట్నం! :ఈ ప్రాజెక్ట్​ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ కానుంది. ఈ మార్గంలో శంషాబాద్, రాజమహేంద్రవరం విమానాశ్రయాలను అనుసంధానించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. విమాన ప్రయాణికులు సెమీ హైస్పీడ్‌ రైళ్లలో స్వ స్థలాలకు వేగంగా చేరుకునేలా రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించింది. గంటకు 220 కిలోమీటర్లు వేగంతో రైళ్లు ప్రయాణించేలా సెమీ హై స్పీడ్‌ కారిడార్‌ను డిజైన్‌ చేస్తున్నారు. ఈ సెమీ హైస్పీడ్​ కారిడార్​ పూర్తయితే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నానికి 4 గంటల్లోపే చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ 2 నగరాల మధ్య రైలు ప్రయాణానికి 12 గంటల సమయం పడుతోంది. వందే భారత్‌లో ప్రయాణిస్తే 8.30 గంటల్లో చేరుకున్నారు.

మహానగరికి మహార్దశ - రూ. 2,245 కోట్లతో 57 కి.మీ. రైల్వే లైన్‌ నిర్మాణం

రెట్టింపు వేగం తగ్గనున్న సమయం :సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి ప్రస్తుతం 2 మార్గాల్లో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. మొదటిది వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గం కాగా రెండోది నల్గొండ, గుంటూరు, విజయవాడ మీదుగా విశాఖ పట్టణానికి ప్రయాణం చేస్తున్నారు. రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 110-130 కిలోమీటర్లు మాత్రమే. ఈ రెండు మార్గాలతో పోలిస్తే కొత్తగా రానున్న శంషాబాద్‌-విశాఖపట్నం మార్గం మరింత దగ్గర అవుతుంది. వేగం దాదాపు రెట్టింపై ప్రయాణ సమయం సగాని కంటే ఎక్కువ తగ్గిపోతుంది.

కర్నూలు మార్గం ఇలా :శంషాబాద్​ ఎయిర్​పోర్టు నుంచి విశాఖపట్టణానికి సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ ప్రతిపాదిత మార్గంలో మరో కీలక అంశం కూడా ఉంది. విశాఖపట్నం-కర్నూలు వరకు అనుసంధానం మార్గాన్ని సూర్యాపేట మీదుగా ప్రతిపాదించగా ఈ మార్గంలో మొత్తం 8 రైల్వే స్టేషన్లను అదనంగా వచ్చి చేరుతున్నాయి.

ఆ రైల్వే స్టేషన్లకు నూతన సొబగులు - విమానాశ్రయాల తరహాలో తీర్చిదిద్దేలా హంగులు

ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లు : శంషాబాద్‌-విశాఖపట్నం సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ని పరిశీలిస్తే హైదరాబాద్‌-విజయవాడ 65వ జాతీయ రహదారి ( National Highway 65) మార్గానికి కాస్త అటూ ఇటూ గానే కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రైలు మార్గం సదుపాయం లేని అనేక పట్టణాలు, జిల్లాలు కొత్త కారిడార్‌తో రైల్వే నెట్‌వర్క్‌లో చేరే అవకాశం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోదాడ, సూర్యాపేట, నకిరేకల్​, నార్కట్​పల్లి వంటి పట్టణాలకు నేటి వరకు రైలు మార్గం లేదు. అదే విధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నాగర్​కర్నూల్​, వనపర్తి, కల్వకుర్తి పట్టణాలు కొత్త కారిడార్​తో రైల్వే నెట్​వర్క్​లో చేరే అవకాశం ఉంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా మొత్తంలో ఎక్కడా రైల్వే లైనే జాడ కనిపించదు. ఇలాంటి ప్రాంతాల మీదుగా ఇప్పుడు ఏకంగా గంటకు 220 కిలోమీటర్లు వేగంతో రైళ్లు దూసుకెళ్లే సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.

విజయవాడ రైల్వేస్టేషన్‌కు అరుదైన ఘనత - ఎన్‌ఎస్‌జీ1గా గుర్తింపు - NSG 1 designation for Vijayawada

Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details