Semi High Speed Rail Corridor : తెలుగు రాష్ట్రాల్లోని (ఏపీ, తెలంగాణ) ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ప్రాజెక్టు ప్రణాళిక కీలకదశకు చేరింది. శంషాబాద్-విశాఖ (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ ట్రైన్ కారిడార్ ఎలైన్మెంట్ ఖరారైంది. సూర్యాపేట, ఏపీలోని విజయవాడ మీదుగా ఈ మార్గాన్ని ప్రతిపాదించారు.
ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్ను నిర్మించనున్నారు. ఇది ఏపీలోని విశాఖ నుంచి మొదలై సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్కర్నూల్ మీదుగా కర్నూలు చేరుతుంది. వీటి ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్ (పెట్) సర్వే చివరి దశకు చేరింది. ఈ సర్వే నివేదికను నవంబరులో రైల్వేబోర్డుకు సమర్పించనున్నట్లుగా సమాచారం.
నాలుగు గంటల్లోనే హైదరాబాద్- విశాఖ :తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్ కారిడార్గా ఇదే కానుండటం విశేషం. ఈ రూట్లో శంషాబాద్, రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్లను అనుసంధానించేలా ప్రణాళిక రూపొందించడం మరో విశేషం. విమాన ప్రయాణికులు సెమీ హైస్పీడ్ రైళ్లలో స్వస్థలాలకు త్వరగా చేరుకునేలా రైల్వేశాఖ ప్రణాళికను రూపొందించింది. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా సెమీ హైస్పీడ్ కారిడార్ను డిజైన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ (శంషాబాద్) ఎయిర్పోర్టు నుంచి విశాఖపట్నానికి 4 గంటల్లోపే చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణం 12 గంటల సమయం పడుతోంది. వందేభారత్ రైలు 8.30 గంటల్లో చేరుకుంటోంది.
రెట్టింపు వేగం తగ్గనున్న ప్రయాణ సమయం :సికింద్రాబాద్- విశాఖకు ప్రస్తుతం రెండు మార్గాల్లో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. మొదటిది వరంగల్, ఖమ్మం, విజయవాడ రూట్, రెండోది నల్గొండ, గుంటూరు, విజయవాడ రూట్. ఈ మార్గాల్లో రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 110-130 కిలోమీటర్లు మాత్రమే. ఈ రెండింటితో పోలిస్తే కొత్తగా రానున్న శంషాబాద్-విశాఖపట్నం మార్గం దగ్గరకానుంది. వేగం దాదాపు రెట్టింపై ప్రయాణ సమయం సగానికంటే గణనీయంగా తగ్గిపోతుంది.