ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బుడమేరు ఎఫెక్ట్ అప్డేట్స్ - ఆపద్బాంధవుల్లా నిలిచిన సహాయక బృందాలు - Budameru Floods

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 7:16 AM IST

Vijayawada Floods: గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడపై బుడమేరు విరుచుకుపడింది. ఊహకు అందని రీతిలో విధ్వంసం సృష్టించింది. చాలా ప్రాంతాల్లోని ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇలాంటి స్థితిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆపద్బాంధవుల్లా ఆదుకుంటున్నారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Budameru Floods
Budameru Floods (ETV Bharat)

Relief Operations Budameru Victims : బుడమేరు సృష్టించిన విధ్వంసంతో విజయవాడ అతలాకుతలమైంది. నగరంలోని నాలుగో వంతు భూభాగం నీట మునిగింది. దాదాపు 2,75,000ల మంది వరదల్లో చిక్కుకున్నారు. ఇలాంటి సమయంలో సహాయక బృందాలు బాధితులకు భరోసానిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 23 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలో నిమగ్నమయ్యాయి. ఒక్కో బృందంలో 30 మంది చొప్పున 690 మంది అత్యవసర విధుల్లో పనిచేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 6,000ల మందిని ముంపు ప్రాంతాల నుంచి రక్షించాయి.

విస్తృతంగా సేవలు అందిస్తున్న బృందాలు : ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నవారికి ఆహారాన్ని అందిస్తున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం వరద ప్రాంతాల్లో విస్తృతంగా సేవలు అందిస్తున్నాయి. నగరంలో 18 బృందాలు బాధితులకు సాయం చేస్తున్నాయి. ఇండ్లలో చిక్కుకున్న వారిని పడవల ద్వారా బయటకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. బాధితులకు ప్రాథమిక చికిత్స కూడా అందిస్తున్నాయి.

డీజీపీ ద్వారకా తిరుమలరావు వరద ప్రాంతాల్లో తిరుగుతూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. రామవరప్పాడు ఇన్నర్‌ రింగ్‌రోడు పక్కనే ఉంటున్న శాంతి భద్రతల ఐజీ శ్రీకాంత్‌ నివాసం పూర్తిగా నిండిపోయింది. ఐనా ఆయన రోజూ పడవ ద్వారా బయటకొస్తూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నగర పోలీసులతో పాటు ఏపీఎస్పీ, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ యూనిట్ల నుంచి సుమారు 4,000ల మంది విడతల వారీగా పనిచేస్తున్నారు.

AP Rains 2024 :వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు ఆహార పొట్లాలను తరలించే వాహనాలకు బందోబస్తుగా ఉంటున్నారు. సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ట్రాఫిక్‌ నియంత్రణ, వృద్ధులు, దివ్యాంగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాలన్నింటి నుంచి దాదాపు 600 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు అందిస్తున్నారు. తాళ్ల సాయంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్లలోకి వెళ్లి తాగునీరు, ఆహారం అదిస్తున్నారు. వరద నీటిలో ఈదుకుంటూ వెళ్లి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Budameru Victims Problems :సహాయక సిబ్బంది సాంకేతికత సాయంతో సహాయ చర్యలను వేగవంతం చేస్తున్నారు. వరదలకు అతలాకుతమైన ప్రాంతాల్లో ప్రత్యేక సమాచార వాహనాన్ని పెట్టారు. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు ప్రధాన కార్యాలయంలోని వారితో సంభాషిస్తున్నారు. పోలీసులు సింగ్‌నగర్‌లో ఫాల్కన్‌ వాహనాన్ని పెట్టారు. వాహనం చుట్టూ ఉన్న 5 పీటీజెడ్ కెమెరాల ద్వారా మూడు కిలోమీటర్ల దూరంలోని వాటిని కూడా స్పష్టంగా చూడొచ్చు. దృశ్యాలను పరిశీలించేందుకు ఈ వాహనంలో పెద్ద తెర ఉంటుంది. దీని ద్వారా విధులు నిర్వహిస్తున్న పోలీసులను ఇక్కడి నుంచి అప్రమత్తం చేస్తున్నారు.

కదిలిస్తే కన్నీరే - సర్వం కోల్పోయామని సింగ్​నగర్​ వాసుల ఆవేదన - Vijayawada flood

విజయవాడను ముంచెత్తిన వరద- జలదిగ్బంధంలో జనావాసాలు - Heavy Floods in Vijayawada

ABOUT THE AUTHOR

...view details