Mohan Babu, Manoj Meet Ranga Reddy District Collector: ఆస్తి తగాదాల విషయంలో నటుడు మంచు మోహన్బాబు, మనోజ్ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లోని జిల్లా సమీకృత కార్యాలయానికి ఇరువురు వచ్చారు. తల్లిదండ్రులు, వృద్ధులు, సంరక్షణ, పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలంటూ కొద్దిరోజుల క్రితం తన ప్రతినిధితో మోహన్బాబు లేఖ పంపించారు.
బాలాపూర్ మండలం జల్పల్లి గ్రామంలో తానుంటున్న ఇంట్లోకి మనోజ్ అక్రమంగా ప్రవేశించారని, ఆస్తులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. మోహన్బాబు వేసిన పిటిషన్పై రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎదుట ఇటీవల మంచు మనోజ్ హాజరై వివరణ ఇచ్చారు. తాజాగా మోహన్బాబు, మనోజ్ ఇద్దరూ కలెక్టర్ వద్దకు వచ్చారు. తన ఆస్తులను మనోజ్ అక్రమంగా ఆక్రమించారని మోహన్బాబు ఫిర్యాదు చేశారు. 'నా స్వార్జిత ఆస్తిపై ఎవరికీ హక్కు లేదు. మనోజ్ నా ఆస్తులు నాకు అప్పగించాలి' అని మోహన్బాబు స్పష్టం చేశారు.
నాతో పాటు భార్య మౌనికపైనా దాడి చేశారు - పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు
మనోజ్కు నోటీసులు: మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన రెవెన్యూ అధికారులు సదరు చట్టం ప్రకారం మంచు మనోజ్కు నోటీసులు పంపించారు. వీటికి సమాధానమిచ్చేందుకు మనోజ్ జనవరి 19న కొంగరకలాన్లోని కలెక్టరేట్కు వచ్చారు. జాయింట్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మోహన్బాబు ప్రతినిధి గత నెల కలెక్టరేట్కు వచ్చి ఫిర్యాదు చేశారని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి చెప్పారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా విచారణ నిర్వహించేందుకు మనోజ్కు నోటీసులు పంపించామని తెలిపారు.
నేను పోరాడేది ఆస్తుల కోసం కాదు: తమ తండ్రి, అన్నదమ్ముల మధ్య ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని మంచు మనోజ్ గతంలో స్పష్టం చేశారు. తమ విద్యాసంస్థలు, ట్రస్ట్లో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వ్యతిరేకించినందుకే అన్నయ్య విష్ణు నాన్న మోహన్బాబును అడ్డుపెట్టుకుని నాటకమాడుతున్నారని ఆరోపణలు చేశారు. తమ వద్ద డబ్బుల్లేవ్ అంటున్న తండ్రి, అన్నయ్యలు రూ.వందల కోట్ల బడ్జెట్తో సినిమాలు ఎలా తీస్తున్నారని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు, విద్యార్థులు, బంధువుల కోసమే తాను పోరాడుతున్నానని ఆస్తుల కోసం కాదని మనోజ్ తెలిపారు.
మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదు - మోహన్బాబు భార్య సంచలన లేఖ
చట్టం తన పని తాను చేస్తుంది - బహిరంగంగా ఎవ్వరూ స్పందించొద్దు : మంచు విష్ణు