Prelates Anger On Tirumala Laddu Issue :తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపవిత్ర పదార్థాలు వాడారని తెలిసి ఎంతో వేదన చెందినట్లు చెప్పారు. కృష్ణా జిల్లా పెద్దపులిపాకలో హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు మాట్లాడారు. ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయంతో భక్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. అపవిత్ర పదార్థాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వామి సన్నిధిలో వేరే మతస్థులకు ఉద్యోగం ఉండకూడదని, శ్రీవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నవారికే ఉద్యోగాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం, ప్రజలు కలిసి ధర్మాన్ని రక్షించాలన్నారు.
ల్యాబ్ నివేదికలు మనకు ఆధారం. కల్తీ జరిగిందని నివేదికలు స్పష్టం చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సిందేని అన్నారు. ఇంకా తప్పు జరగలేదంటే అపహాస్యమే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ధర్మబద్ధంగా ఉండాల్సినచోట ఇలాంటి ప్రవర్తన మంచిది కాదని, ప్రసాదం అంటే కళ్లకు అద్దుకుని పవిత్ర మనస్సుతో తీసుకుంటామి తెలిపారు. ల్యాబ్లు ఇచ్చిన నివేదిక ప్రకారం కోర్టుకు వెళ్లాల్సిందేనని, కోర్టు విధించిన శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటివి మరోసారి జరగకుండా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వరస్వామి లడ్డూను కల్తీ చెయ్యడం నీచమైన పని. లడ్డూ నాణ్యతపై ఎప్పటి నుంచో వివాదం జరుగుతుంది. కారకులపై చర్యలు తీసుకోవడం తప్పనిసరి. తాము తప్పు చెయ్యకపోతే మాజీ ఛైర్మన్ విజిలెన్స్ విచారణ చెయ్యకూడదని కోర్టుకు ఎందుకు వెళ్లారు. దీనిపై సీబీఐ విచారణ జరిపాలి, ప్రక్షాళన చెయ్యాలి.' -రామకృష్ణ హిందూదేవాలయ పరిరక్షణ సమితి ఛైర్మన్