తెలంగాణ

telangana

ETV Bharat / state

గచ్చిబౌలి కాల్పుల ఘటన కేసు - మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్‌ను విచారిస్తున్న పోలీసులు - INVESTIGATION ON GACHIBOWLI CASE

గచ్చిబౌలి కాల్పుల ఘటన కేసులో పోలీసుల దర్యాప్తు - ప్రభాకర్‌ను విచారిస్తున్న సీసీఎస్, ఎస్‌వోటీ క్రైమ్ బృందాలు - ప్రభాకర్‌పై తెలుగు రాష్ట్రాల్లో 80 కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు

Police Interrogating The Accused In The Gachibowli case
Police Interrogating The Accused In The Gachibowli case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2025, 8:03 PM IST

Police Interrogating The Accused In The Gachibowli case :హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో కలకలం సృష్టించిన కాల్పుల ఘటన కేసులో విచారణ కొనసాగుతోంది. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్‌ అలియాస్‌ రాహుల్‌రెడ్డిని శనివారమే అరెస్టు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. సీసీఎస్‌, ఎస్‌వోటీ క్రైమ్‌ బృందాలు నిందితుడి నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే నిందితుడి నుంచి 2 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని బిహార్‌ నుంచి కొనుగోలు చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ప్రభాకర్‌పై తెలుగు రాష్ట్రాల్లో 80 వరకూ చోరీ కేసులు ఉన్నాయి.

ఇంతకీ ఏం జరిగిందంటే :ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్‌ పాత నేరస్థుడు. 2022 మార్చి నెలలో విచారణ నిమిత్తం అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో తప్పించుకుపోయాడు. అప్పటినుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇటీవల సైబరాబాద్‌ పరిధిలోని మొయినాబాద్, నార్సింగి పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు చోరీలు చేశాడు.

కాగా నిందితుడు ఎక్కువగా ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చోరీ చేస్తుంటాడు. ప్రవేశాలు, పరీక్షలు, హాస్టల్‌ ఫీజు డబ్బులు కళాశాలల్లో ఉంటాయని పక్కా పథకంతో చోరీలు చేస్తాడు. ఇటీవల నార్సింగి, మొయినాబాద్‌లో జరిగినటువంటి చోరీల్లో వేలిముద్రల్ని విశ్లేషించగా ప్రభాకర్‌ వేలిముద్రలతో సరిపోలాయి. నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు దోపిడీ చేసిన డబ్బుతో వీకెండ్స్​లో పబ్‌కు వెళ్తున్నట్లుగా సీసీ ఫుటేజీల్లో గుర్తించారు. ఐటీ కారిడార్‌లోని పబ్‌ల సిబ్బంది, బౌన్సర్లకు నిందితుడికి సంబంధించిన ఫొటోలిచ్చి ఆచూకీ తెలిస్తే సమాచారమివ్వాలని సూచించారు.

ప్రభాకర్‌ శనివారం సాయంత్రం 7.10 గంటల సమయంలో గచ్చిబౌలిలో ఉన్నటువంటి ప్రిజం పబ్‌ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. గుర్తించిన బౌన్సర్లు పబ్​ను 7.30 గంటలకు తెరుస్తారని అప్పటివరకూ ఎదురుచూడాలని అతడికి చెప్పారు. మద్యం సేవించి ఉన్న నిందితుడు ఫోన్‌ ఛార్జర్‌ అడగ్గా ఇచ్చారు. పక్కకు వెళ్లి ఛార్జింగ్‌ పెట్టుకునే సమయంలో పోలీసులకు నిందితుడి గురించి సమాచారమిచ్చారు.

7.30 గంటల సమయంలో సైబరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌) హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామిరెడ్డితో పాటు కానిస్టేబుళ్లు ప్రదీప్‌రెడ్డి, వీరస్వామి మఫ్టీలో వచ్చారు. నిందితుడిని పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించేలోపు అతడు తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. హెడ్​ కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డి పాదం నుంచి ఒక తూటా దూసుకెళ్లడంతో గాయపడ్డాడు. ఉలిక్కిపడ్డ సహచర కానిస్టేబుళ్లు బౌన్సర్ల సాయంతో నిందితుడిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

హైదరాబాద్​లో పోలీసులపై కాల్పులు - బౌన్సర్ల సాయంతో మోస్ట్​ వాంటెడ్ దొంగ​ అరెస్ట్

అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో పురోగతి - కీలక దొంగను గుర్తించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details