Pegasus Representatives met with CBN:పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఛైర్మన్ క్రేయిగ్ కోగుట్, ఆపరేటింగ్ అడ్వైజర్ గినా మెగ్కార్తీ, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సీఈవో కీత్ అగోడా ముఖ్యమంత్రితో సచివాలయంలో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం సాగవుతోందని తెలిపారు. 2028-29 నాటికి రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించి తద్వారా 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం సాగయ్యేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం వివరించారు.
పెగాసస్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు:సమావేశం ఇటీవల దావోస్ పర్యటనలో చంద్రబాబుతో భేటీ అయిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు ఏపీకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇవాళ భేటీ అయ్యారు. పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఛైర్మన్ క్రేయిగ్ కోగుట్, ఆపరేటింగ్ అడ్వైజర్ గినా మెగ్కార్తీ, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సీఈవో కీత్ అగోడా ముఖ్యమంత్రితో సచివాలయంలో సమావేశం అయ్యారు. ప్రకృతి వ్యవసాయం, భిన్నమైన వాతావరణాన్ని తట్టుకోగల పంటలను అందించడం, రైతు నుండి వినియోగదారు వరకు ఎండ్-టు-ఎండ్ అనుసంధాన వ్యవస్థను రూపొందించడం, మార్కెట్ డెవలప్మెంట్, ఫైనాన్సింగ్, డేటా మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంపై ఈ సంస్థలు సహాయపడనున్నాయి.
పబ్లిక్, ప్రైవేట్ సంస్థల నుంచి ఆర్థిక సాయాన్ని అందించేందుకు ఇవి సంపూర్ణ సహకారాన్ని అందించనున్నాయి. అంతే కాకుండా ప్రకృతి వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ కోసం ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ప్రమోట్ చేస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన రైతు సాధికార సంస్ధతో పెగాసస్ క్యాపిటల్ అడ్వజైర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థలు ఎంవోయూ చేసుకోనున్నాయి. రాష్ట్రంలో అవకాశాలను, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను, ప్రస్తుత పరిస్థితులను ఆ సంస్థల ప్రతినిధులకు సీఎం వివరించారు. ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయని ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోందని అన్నారు.